ఎంతమందికి రుణమాఫీ చేశారో చెప్పండి : ఎమ్మెల్యేరఘునందన్​రావు

by  |
ఎంతమందికి రుణమాఫీ చేశారో చెప్పండి : ఎమ్మెల్యేరఘునందన్​రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా తయారైందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు జీరో అవర్​లో ధరణి వెబ్​సైట్​లో తలెత్తుతున్న సమస్యల వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ చట్టాల్లో ఉన్న లోపాలను సవరించి ధరణిని గొప్పగా ప్రారంభించిందని, అయితే సమస్యలు మాత్రం పరిష్కారం అవ్వకుండా అలాగే ఉన్నాయని విమర్శించారు. రైతుల సమస్యలపై ఏ అధికారిని అడిగినా కలెక్టర్​ను కలవాలని సూచిస్తున్నారన్నారు. కలెక్టర్లు.. ఎమ్మెల్యేల ఫోన్​కాల్స్​కే స్పందించడంలేదని, ఇక సామాన్యులు, రైతులకు ఎక్కడ కలుస్తారని పేర్కొన్నారు. నేటికీ డిజిటల్​సంతకాలు పెండింగ్​లోనే ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధరణిని చూసి ఎన్నారైలు కూడా సంతోషిస్తున్నారని గొప్పలు చెబుతోందని ఎద్దేవా చేశారు. రైతులకు చెందిన ఏదైనా ఒక సర్వే నంబర్ లో నుంచి కాల్వనో, రోడ్డో వస్తే ఆ సర్వే నంబర్​మొత్తాన్ని అధికారులు బ్లాక్​చేస్తున్నారని, దీనివల్ల సంబంధిత రైతుకు రైతుబంధు, రైతుబీమా రాకుండా పోతోందని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలపై కాల్​సెంటర్​కు ఫోన్​చేసినా వారి నుంచి స్పందన ఉండటం లేదన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఫసల్​భీమా పథకాన్ని తీసుకొస్తే నేటికీ ప్రీమియం చెల్లించకుండా రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అనుకోని విపత్తుల వల్ల రైతులు పంట నష్టపోతే ఫసల్​బీమా పథకం ఆదుకుంటుందన్నారు. ఈ ఏడేళ్లలో రైతుల పంట నష్టానికి రాష్ట్రప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో సమాధానం చెప్పాలని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. ఇకపోతే 2018 నుంచి రూ.1లక్ష రైతు రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్​హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed