బాల కార్మికులతో చాకిరి చేయిస్తున్న ముగ్గురు అరెస్ట్

by  |
బాల కార్మికులతో చాకిరి చేయిస్తున్న ముగ్గురు అరెస్ట్
X

దిశ, క్రైమ్‌బ్యూరో: బాల కార్మికులను అక్రమంగా రవాణా చేస్తూ వెట్టిచాకిరి చేయిస్తున్న ముగ్గురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 11మందికి విముక్తి కల్పించారు. రంగారెడ్డి జిల్లా పసుమాములలో మహేష్ జిప్సమ్ ప్లాస్టర్ కంపెనీ పేరుతో ఉత్తర‌ప్రదేశ్‌కు చెందిన రామ్‌లాల్ (ఏ1), పవన్ పుత్ర ప్లాస్టర్ కంపెనీ పేరుతో పంకజ్ కుమార్ (ఏ2)లు ప్లాస్టర్ ఆఫ్ పారీస్ కంపెనీలను నిర్వహిస్తున్నారు. తక్కువ వేతనాలకే ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకూ విరామం లేకుండా పనిచేయడం లాంటి కారణాలతో హయత్‌నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు ఇక్కడ పనిచేయడానికి అంగీకరించలేదు.

దీంతో రామ్ లాల్ ఏడుగురిని, పంకజ్ కుమార్ నలుగురిని ఉత్తరప్రదేశ్, బీహార్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి 8 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలను అక్రమంగా తరలించారు. బలవంతంగా వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఇరుకైన షెడ్డులో బంధించి, బయటకు వెళ్లనీయకుండా.. అక్కడే 14గంటల పాటు విశ్రాంతి లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రాచకొండ యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ విభాగం పోలీసులు, జిల్లా బాలల పరిరక్షణ సమితి, బచపన్ బచావో ఆందోళన్, స్పందన చిల్ట్రన్ సొసైటీ సభ్యులు సంయుక్తంగా మహేష్ జిప్సమ్ ప్లాస్టర్ కంపెనీ, శ్రీపవన్ పుత్ర ప్లాస్టర్ కంపెనీలపై దాడులు చేసి ఇద్దరు నిర్వాకులతో పాటు సూపర్ వైజర్ ఎటుకాల జగన్‌మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

Next Story

Most Viewed