మార్క్‌ఫెడ్‌కు బీహార్ దెబ్బ!

by  |
మార్క్‌ఫెడ్‌కు బీహార్ దెబ్బ!
X

దిశ, ఆదిలాబాద్: తెలంగాణ మార్క్ ఫెడ్ కు బీహార్ వ్యాపారులు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఆర్థిక సాయంతో మక్కలను కొనుగోలు చేసిన మార్క్ ఫెడ్ రైతుల నుంచి క్వింటాలుకు రూ. 1,760కి కొనుగోలు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సుమారు 20 లక్షల క్వింటాళ్ల దాకా మక్కలను కొనుగోలు చేసింది. ఇంకా కొన్ని చోట్ల కొనుగోలు చేయాల్సి ఉంది. కొనుగోలు చేసిన మక్కలను ఎక్కడికక్కడ ప్రభుత్వ, ప్రైవేటు గోదాముల్లో మార్క్ ఫెడ్ నిల్వ చేసింది. ఒక సందర్భంలో గోదాములు సరిపోకపోవడంతో నిజామాబాద్, మహారాష్ట్రలోని ధర్మాబాద్ ప్రాంతంలో నిల్వ చేశారు. నిల్వచేసిన మక్కలను ప్రభుత్వం పౌల్ట్రీ వ్యాపారులకు, ఫుడ్ ఫ్యాక్టరీలకు అమ్మాల్సి ఉంది. కాగా, పౌల్ట్రీ ఫామ్ లకు క్వింటాల్ మక్కలకు రూ.1300 నుంచి 1400 వరకు చెల్లించాలని బీహార్ వ్యాపారులు చెప్పడంతో ఇక్కడి పౌల్ట్రీ వ్యాపారులు డీల్ కుదుర్చుకున్నారు. దీంతో మార్క్ ఫెడ్ సేకరించిన మక్కలను ఎటు అమ్మాలో తెలీక ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు.

బీహారీ షాక్..!

మార్క్‌ఫెడ్‌కు బీహార్ రాష్ట్ర మక్కల వ్యాపారులు, అక్కడి ప్రభుత్వ రంగ సంస్థలు భారీ షాక్ ఇచ్చాయి. ఇక్కడ మక్కల కొనుగోళ్లు ప్రారంభం అవుతున్న తొలి రోజుల్లోనే బీహార్ వ్యాపారులు తెలంగాణ, ఏపీపై కన్నేశారు. కోళ్ల పరిశ్రమ వ్యాపారులతో పౌల్ట్రీ ఫీడ్ సరఫరాకు అంగీకారం కుదుర్చుకున్నారు. బీహార్ నుంచి నేరుగా ట్రాన్స్ పోర్ట్ చార్జీలతో సహా కలిపి పౌల్ట్రీ యజమానులకు మక్కలు చేరవేశారు. క్వింటాలుకు దూరాన్ని బట్టి రూ.1300 నుంచి రూ. 1400 రూపాయలతో బీహార్ వ్యాపారులు ఇక్కడి కోళ్ల పరిశ్రమల యజమానులకు పంపిణీ చేస్తున్నారు. ధర తక్కువతో పాటు నేరుగా కోళ్ల పరిశ్రమలకు చేరవేయడంతో తెలంగాణ, ఆంధ్ర పౌల్ట్రీ వ్యాపారులు బీహార్ వ్యాపారుల డీల్‌కు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 80 శాతం మేర కోళ్ల పరిశ్రమల యజమానులు బీహార్ మక్కలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం మార్క్ ఫెడ్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది.

మన మక్కలు ఎవరు కొనాలి..?

ఇదిలా ఉంటే రైతుల నుంచి పెద్ద మొత్తంలో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన మక్కలను అమ్మడం ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. రైతులకు మద్దతు ధర ఇచ్చి మక్కలు కొనుగోలు చేసిన మార్క్ ఫెడ్ ఇప్పటికే గోదాముల్లో నిల్వ చేసింది. అయితే ఇప్పటి వరకు మక్కల రైతులకు ఇంకా చెల్లింపులు జరగలేదు. ప్రభుత్వం అందించే ఆర్థిక చేయూతతో పాటు, మార్క్‌ఫెడ్ వద్ద నిల్వ ఉన్న మక్కలను అమ్మితే గానీ.. రైతులకు డబ్బులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం పౌల్ట్రీ వ్యాపారులకు క్వింటాల్ ధర రూ. 1,500కు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కొన్నిచోట్ల అమ్మకాలు కూడా మొదలు పెట్టింది. అయితే బీహార్ వ్యాపారులు రూ. 200 తక్కువ ధరతో మక్కలు సరఫరా చేయగా.. మార్క్‌ఫెడ్ ఇక్కడ ఎక్కువ ధర ఉండడంతో కోళ్ల పరిశ్రమల యజమానులు మొగ్గు చూపడం లేదు. ఇది మార్క్ ఫెడ్‌కు, పౌల్ట్రీ యాజమాన్యాలకు నడుమ పేచీలా తయారవుతోంది. అయితే బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాల తయారీ కేంద్రాలకు మక్కలు అమ్మేందుకు మార్క్‌ఫెడ్ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.

గోదాములు ఫుల్..!

మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన మక్కలను ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేసిన విషయం తెలిసిందే. అయితే మక్కలను వెంటనే అమ్మితే గానీ గోదాములు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. వరిధాన్యం కొనుగోళ్లు ఇంకా 25 శాతం కూడా పూర్తి కాలేదు. రైస్ మిల్లర్లకు మాత్రమే సరఫరా చేసే పరిస్థితి ఉంది. మిగతా ధాన్యాన్ని సేకరించి నిల్వ చేసేందుకు గోదాములు లేవు. ఇప్పటికే గోదాముల్లో మక్కలు ఉండడంతో ధాన్యం నిల్వ చేసే పరిస్థితి కనిపించడం లేదు.

Next Story

Most Viewed