ఆ భర్తకు అగ్ని పరీక్షే

by  |
ఆ భర్తకు అగ్ని పరీక్షే
X

తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తికి ఆంధ్రప్రదేశ్‌లో అగ్నిపరీక్ష ఎదురైంది. కరోనా వ్యాప్తిపై చైతన్యాన్ని తెలియజెప్పే అద్భుతమైన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యే భర్తను పోలీసులకు అప్పగించి కరోనా పరీక్షలు చేయించింది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే… తెలంగాణలోని మిర్యాలగూడలో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లాలోని తన స్వగ్రామానికి చేరుకున్నాడు.

అయితే భర్త పుట్టెడు ఆనందంతో నానా కష్టాలు పడి వచ్చిన భర్తను ఆదరించాల్సిన భార్య… దూరం పెట్టి ముందు కరోనా పరీక్షలు చేయించుకొమ్మంది. తెలంగాణలో కరోనా బాధితులు పెరుగుతున్నారని, కరోనా పరీక్షలు చేయించుకుంటేనే ఇంట్లో అడుగుపెట్టాలని సూచించింది. తనకేం కాదని, అనవసరమైన ఆందోళన వద్దంటూ ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్లాడు.

దీంతో ఆమె వైరస్ సోకి ఉంటే అది తనకు, తన పిల్లలకు సోకుతుందని, కాబట్టి పరీక్షలు చేయించుకుని, వైరస్ సోకలేదని తేలిన తరువాతే ఇంట్లోకి రావాలని మరోసారి స్పష్టం చేసింది. అయినా అతను వినకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు భార్యాభర్తలిద్దరినీ ఆదోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

Tags : quarantine center, adoni, kurnool district, coronavirus

Next Story

Most Viewed