BWF వరల్డ్ టూర్ ఫైనల్స్ 2021: సెమీస్‌లో PV సింధు, లక్ష్య సేన్

by  |
BWF వరల్డ్ టూర్ ఫైనల్స్ 2021: సెమీస్‌లో PV సింధు, లక్ష్య సేన్
X

దిశ, వెబ్‌డెస్క్: BWF వరల్డ్ టూర్ ఫైనల్స్ 2021 సెమీఫైనల్‌లోకి భారత షట్లర్లు PV సింధు, లక్ష్య సేన్ ప్రవేశించారు. ఇండోనేషియాలోని బాలీ వేదికగా జరుగుతున్న వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో శుక్రవారం భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లకు ఓటములే ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్ గ్రూప్ ఏ మ్యాచ్‌లో పీవీ సింధు 12-21, 21-19, 14-21 తేడాతో వరల్డ్ నెంబర్ 10 ర్యాంకర్ చోచువాంగ్‌పై ఓడిపోయింది. మ్యాచ్ ఆసాంతం సింధు ప్రత్యర్థి పాయింట్లకు అడ్డుకట్ట వేయలేకపోయింది. చోచువాంగ్‌పై పెద్దగా ఒత్తిడి తేకుండానే మ్యాచ్‌ను అప్పగించేసింది. అయితే ఈ మ్యాచ్ ఓడినా.. గత మ్యాచ్‌లు గెలవడంతో గ్రూప్ ఏ నుంచి PV సింధు సెమీఫైనల్ చేరుకున్నది.

ఇక పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌కు వాకోవర్ దొరికింది. గ్రూప్‌లో చివరి మ్యాచ్ ఆర్. జిమ్కేతో జరగాల్సి ఉండగా.. తొలి గేమ్‌లోనే గాయం కారణంగా ప్రత్యర్థి తప్పుకున్నాడు. గ్రూప్ ఏలో లక్ష్యసేన్‌కు రెండు వాకోవర్లు లభించగా.. ఒక ఓటమి ఎదురైంది. అయినా సరే మెరుగైన పాయింట్లతో సెమీఫైనల్ చేరుకున్నాడు. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ ప్రస్థానం ముగిసింది. పురుషుల సింగిల్స్ గ్రూప్ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 19-21, 14-21 తేడాతో లీ జిజ్లా చేతిలో ఓడిపోయాడు. గ్రూప్ బిలో వరుసగా మూడు ఓటములతో కిదాంబి శ్రీకాంత్ వరల్డ్ టూర్ ఫైనల్స్ నుంచి నిష్క్రమించాడు. ఇక మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జోడి ఇంగ్లాండ్‌కు చెందిన చోలీ బిరిచ్-లారెన్ స్మిత్‌లపై 21-19, 9-21, 21-14 తేడాతో గెలిచారు. అయితే ఈ గ్రూప్‌లో అంతకు ముందు వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడిపోయి ఉండటంతో వీరికి సెమీఫైనల్ బెర్త్ దొరకలేదు.


Next Story

Most Viewed