కులాంతర వివాహానికి శిక్ష అత్యంత దారుణం

by  |
కులాంతర వివాహానికి శిక్ష అత్యంత దారుణం
X

కులాంతర వివాహానికి బుందేల్‌ఖండ్‌లోని కుల పెద్దలు అత్యంత హేయమైన శిక్ష విధించారు. కంప్యూటర్ యుగంలో కూడా కుల వివక్ష, కుల దురహంకారం ఏ స్థాయిలో ఉన్నాయో నిరూపించే అత్యంత దారుణమైన ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ఝాన్సీ మెట్రోపోలిస్ ప్రాంతంలోని అన్సారీ గ్వాలతొలిలో భూపేశ్ పాల్ నివాసం ఉంటున్నాడు. ఈయన కుమారుడు ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఇది ఆ గ్రామ పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. వేరు కులానికి చెందిన యువతిని ఎలా పెళ్లి చేసుకుంటారు? అని గ్రామ పెద్దలు ప్రశ్నించారు. ఆ రెండు కుటుంబాలను ఊరి నుంచి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో భూపేశ్ పాల్ గ్రామ పెద్దలను బతిమిలాడుకున్నాడు. ఒప్పించి సమస్య పరిష్కారం కోసం పంచాయతీ పెట్టించాడు. ఖాఫ్ పంచాయతీ.. యువతి వేరే కులానికి చెందినది కాబట్టి ఆమెను శుద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఆమెను ఎలా శుద్ధి చేయాలనుకున్నారంటే.. ఆమె గోమూత్రం తాగి, ఆవు పేడ తినాలని తీర్పునిచ్చారు. అలా చేస్తే ఆమె శుద్ధి చెందుతుందని ప్రకటించారు.

అంతటితో ఆగని పంచాయతీ పెద్దలు కులాంతర వివాహాం చేసుకున్నందుకు ప్రతిగా పంచాయతీకి ఐదు లక్షల రూపాయల జరిమానా కూడా కట్టాలని తీర్పునిచ్చారు. యువతిని తమ కులంలో కలుపుకోవాలంటే ఆమాత్రం శిక్షను అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు. రెండు నెలల్లో శిక్ష అమలు చేస్తామని ప్రకటించారు. డబ్బులు రెడీ చేసుకోవాలని సూచించారు. ఇదేం తీర్పు అంటూ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సభ్యసమాజం తలవంచుకునే ఘటన వెలుగు చూసింది. దీంతో పంచాయతీ పెద్దలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story