భారత్‌లో క్లౌడ్ మార్కెట్ వృద్ధి 31 శాతం : గార్ట్‌నర్!

by  |
భారత్‌లో క్లౌడ్ మార్కెట్ వృద్ధి 31 శాతం : గార్ట్‌నర్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో పబ్లిక్ క్లౌడ్ మార్కెట్లో వ్యయం ఈ ఏడాది 31.4 శాతం మేర పెరుగుతుందని గ్లోబల్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ సంస్థ గార్ట్‌నర్ అంచనా వేసింది. పబ్లిక్ క్లౌడ్ కోసం వినియోగం 2020లో రూ. 24.4 వేల కోట్ల నుంచి 2021లో రూ. 32.6 వేల కోట్లకు పెరుగుతుందని, అలాగే 2022లో 26 శాతం వృద్ధితో రూ. 41.4 వేల కోట్లకు చేరుకుంటుందని గార్ట్‌నర్ తెలిపింది. ఈ ఏడాదిలో కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ కారణంగా రీమోట్ వర్కింగ్ పెరుగుతోంది. ఖర్చులు డెస్క్‌టాప్ సేవలు, మౌలిక సదుపాయాల సేవల విభాగాల్లో ఉండే అవకాశాలున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు తమ వ్యాపారాలను స్థిరంగా, నిరంతరాయంగా కొనసాగించేందుకు క్లౌడ్‌లో పెట్టుబడులు అనివార్యమని గార్ట్‌నర్ రీసెర్చ్ వైస్-ప్రెసిడెంట్ సిడ్ నాగ్ అన్నారు. గత మూడేళ్లలో క్లౌడ్ వ్యయంలో భారత్ స్థిరంగా రెండంకెల వృద్ధిని సాధించిందని ఆయన తెలిపారు. మొట్టమొదటిసారిగా భారత్‌లో సాఫ్ట్‌వేర్ యాస్ ఏ సర్వీస్, క్లౌడ్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ సేవలకు ఖర్చులు రెండంకెల వృద్ధిని సాధించడానికి సిద్ధంగా ఉన్నట్టు గార్ట్‌నర్ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే క్లౌడ్ మేనేజ్‌మెంట్ విభాగంలో 20.8 శాతం, సెక్యూరిటీ సేవల్లో 18 శాతం పెరిగినట్టు వెల్లడించింది.


Next Story