నాణ్యమైన విద్యనందించడం సవాలే..

by  |
Student
X

దిశ, తెలంగాణ బ్యూరో : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం పెద్ద సవాలేనని తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. రాబోయే 2021-2022 విద్యాసంవత్సారానికి సంబంధించి విద్యాశాఖ అనుసరించాల్సిన విధివిధానాలపై ఆ శాఖ కార్యాదర్శికి శుక్రవారం లేఖ ద్వారా పలు సూచనలు చేశారు. కొవిడ్ విద్యార్థుల డ్రాపౌట్ రేటు, బాల కార్మికులు, బాల్య వివాహాలపై తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం సవాలుగా మారిందని, ఇందుకు ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం కూడా కష్టతరంగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనికి తోడు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాల లభ్యత ఒక సమస్యగా మారిందన్నారు. అక్కడి విద్యార్థులు వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఫోన్లు కొనుగోలు చేయలేరని తెలిపారు. దీనిని నివారించేందుకు టీవీని వినియోగించుకోవడం ఉత్తమమని శ్రీనివాసరావు ఆ లేఖలో తెలిపారు.

కరోనాను నివారించడంలో స్థానిక యువత, గ్రామ పంచాయతీలు చురుకైన పాత్ర పోషించాలన్నారు. అలాగే విద్యశాఖ అన్ని స్థాయిల్లో పంచాయతీరాజ్, మునిసిపల్ పరిపాలన శాఖను కూడా సమన్వయం చేయాలని సూచించారు. అంతేకాకుండా మండలం, జిల్లా స్థాయిలో నోడల్ పాయింట్ వ్యక్తులను ఏర్పాటుచేయాలని కమిషన్ సూచించింది. పిల్లల ఆరోగ్యంపై ఆర్‌బీఎస్ కే దృష్టిపెట్టి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు.

విద్యార్థుల పెరుగుదల కోసం మధ్యాహ్న భోజన కార్యక్రమం చాలా ముఖ్యమైనదని, ఈ క్లిష్ట సమయంలో వారి పోషక అవసరాలను తాత్కాలిక టేక్ హోమ్ రేషన్ ద్వారా అందించేలా విద్యాశాఖ ప్రణాళికలు చేయాలని సూచించారు. అలాగే, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించడానికి సరైన మార్గదర్శకాలను జారీ చేసి వాటి అమలును పర్యవేక్షించాలని శ్రీనివాసరావు లేఖలో సూచించారు.



Next Story