భట్టికి అవమానం… అధికారులపై ఆగ్రహం

by  |
భట్టికి అవమానం… అధికారులపై ఆగ్రహం
X

దిశ, మ‌ధిర: ఖ‌మ్మం జిల్లా మధిర నియోజ‌క‌వ‌ర్గ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం చెల‌రేగింది. సోమ‌వారం ఉద‌యం కొనుగోలు కేంద్ర ప్రారంభోత్స‌వానికి రావాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే, సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌కు మార్కెట్ అధికారులు, క‌మిటీ స‌భ్యులు ఆహ్వానించారు. 11 గంటలకు సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి రావాల్సిందిగా భట్టివిక్రమార్కకు అధికారులు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో 10 గంటలకు భట్టి విక్రమార్క పీఏ మార్కెటింగ్ శాఖ సెక్రెటరీకి ఫోన్ చేశారు.

దీంతో కార్య‌క్ర‌మం 30 నిముషాలు ఆలస్యంగా, 11:30 గంటలకు ఉంటుంద‌ని తెలిపారు. ఈ క్రమంలో 11:45కు భట్టి విక్రమార్క మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అయితే అప్పటికే ప్రారంభోత్సవం ముగిసిన‌ట్టుగా అధికారులు తెల‌ప‌డంతో వారిపై భట్టి ఫైర్ అయ్యారు. ప్ర‌భుత్వ అధికారిక కార్య‌క్ర‌మానికి పిలిచి స్థానిక ఎమ్మెల్యేనైనా తాను లేకుండా ఎలా ప్రారంభిస్తారంటూ అధికారుల తీరుపై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. అధికారులు సమాధానం చెప్పే ప్రయత్నం చేయగా, తీవ్ర స్వ‌రంతో వారిని హెచ్చ‌రించారు. ప్రొటోకాల్ పాటించ‌డం లేదంటూ, అధికారుల‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టు భట్టి విక్రమార్క తెలిపారు.

Next Story

Most Viewed