పేటలో వ్యభిచారం.. జాతీయ రహదారే అడ్డా

by  |
పేటలో వ్యభిచారం.. జాతీయ రహదారే అడ్డా
X

పేటలో కొంతకాలంగా వ్యభిచారం దందా యథేచ్ఛగా సాగుతోంది. స్థానిక అంజనీపూర్ కాలనీలో 15 మంది యువతులతో దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం. పేదరికంలో మగ్గుతున్న యువతులు, బాలికలకు ఈజీ మనీ ఆశ జూపుతూ ఈ కూపంలోకి లాగుతున్నారు. ఈ దందా పోలీస్ స్టేషన్లకు కూతవేటు దూరంలోనే జరుగుతుండటం శోచనీయం.

దిశ సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలో కొంతకాలంగా వ్యభిచారం దందా గుట్టుగా సాగుతోంది. పేదరికంలో మగ్గుతున్న యువతులను టార్గెట్ చేస్తున్నారు. వారికి ఈజీ మనీ ఆశ జూపుతూ నరక కూపంలోకి లాగుతున్నారు. జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతాలను ఎంచుకొని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సూర్యాపేట లో జమ్మిగడ్డ, చర్చి కాంపౌండ్, భగత్ సింగ్ నగర్, విద్యా నగర్ కాలనీలతో పాటు పలు గృహాల్లో వ్యభిచారం సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చుట్టుపక్కల వారికి సైతం అనుమానం రాకుండా ఈ వ్యవహారం కొనసాగిస్తున్నారు. ఈ విషయమైపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్వాహకులు ఎప్పటికప్పుడూ అనుమానం రావడంతో వ్యూహాలు మార్చుతున్నట్లు టాక్ నడుస్తోంది.టెక్నాలజీ వాడుతూ వ్యభిచారం దందా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

పట్నంలో పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో విజయవాడ హైవే పక్కన ఉన్న రాజా గారి హోటల్ వెనక వైపులో ఉన్న చెట్ల పొదల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. దాడి చేయగా అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళతో పాటు ఆమె సహాయకుడిని, ఒక విటుడుని అదుపులోకి తీసుకున్నారు. మరో ఘటనలో కొత్త బస్టాండ్ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళ నిర్వాహకురాలిని, విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రశ్నించగా ఆంధ్రా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మహిళను తీసుకొచ్చి వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నట్లు తేలింది.

15 మంది యువతులతో..

హైటెక్ బస్టాండ్ వద్ద 13 ఏండ్ల బాలిక మద్యం మత్తులో అనుమానాస్పదంగా కనిపించడంతో అనుమానం వచ్చి ఓవ్యక్తి సఖీ కేంద్రం, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సఖీ కేంద్రం నిర్వాహకులు, పోలీసులు బాలికను అదుపులోకి తీసుకొని విచారించారు. అంజనీపూర్ కాలనీలో నాలుగు ఇండ్లలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రొంపిలో మొత్తం 15 మంది యువతులు ఉన్నట్లు తెలిసింది. యువతులకు మద్యం, హార్మోన్స్ ఇంజక్షన్లు చేయించి ఈ రొంపిలోకి లాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రెచ్చిపోతున్న దళారులు

సూర్యాపేట జిల్లాలో వ్యభిచారం దందా యథేచ్ఛగా సాగుతున్నది. అమ్మాయిలను సరఫరా చేసే బ్రోకర్లు రెచ్చిపోతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు నలుమూలలా వ్యభిచార గృహాలు ఉన్నట్లు సమాచారం. పనుల నిమిత్తం సూర్యాపేటకు వచ్చే వ్యాపారులు, ఇతర వ్యక్తులు లాడ్జీల్లో బస చేస్తుంటారు. ఆ క్రమంలో వారిని టార్గెట్ చేస్తూ దళారులు వ్యభిచారం దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా పోలీసులు ముడుపులు తీసుకుంటూ చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే వాదనలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.

అంతా వాట్సాప్ ద్వారానే..

కొందరు దళారులు హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వివిధ పనుల నిమిత్తం సూర్యాపేట వచ్చే వ్యాపారుల ఫోన్ నెంబర్లతో పాటు.. అమ్మాయిలు కావాలంటూ కోరే విటుల నంబర్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆ క్రమంలో వారికి వాట్సాప్ ద్వారా అమ్మాయిల ఫోటోలతో పాటు రేట్ల వివరాలు కూడా పంపుతున్నట్లు తెలిసింది. దాంతో అవతలి వారు తమకు ఎవరు నచ్చారో చెబితే వారిని పంపిస్తున్నారని సమాచారం. అలా గంటకో రేటు, రోజుకో రేటు చొప్పున దందా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. గంట సమయం గడపాలనుకుంటే దాదాపు వెయ్యి నుంచి నాలుగైదు వేల వరకు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

విచారణ వేగవంతం చేస్తాం

వ్యభిచారం నిర్వహించే ముఠాలపై పూర్తిస్థాయిలో విచారణ వేగవంతం చేస్తున్నాం. జిల్లా కేంద్రంలో వ్యభిచారం నిర్వహించే వారికి త్వరలోనే చెక్ పెడతాం. వ్యభిచార కూపంలోకి దిగి ఎంతోమంది అమాయక యువతులు బలవుతున్నారు. నిర్వాహకులు ఎంతటివారైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

-మోహన్ కుమార్: సూర్యాపేట డీఎస్పీ



Next Story

Most Viewed