బెంగళూరులో పొడిగించిన నిషేధాజ్ఞలు

by  |
బెంగళూరులో పొడిగించిన నిషేధాజ్ఞలు
X

బెంగళూరు: సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలతో బెంగళూరులో చెలరేగిన అల్లర్లకు సంబంధించి ఎఫ్ఐఆర్‌లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిందితులు, అనుమానితులను కస్టడీలోకి తీసుకుంటూనే ఉన్నారు. అవాంఛనీయ ఘటనలను నివారించడానికి అల్లర్లు చోటుచేసుకున్న ఏరియాల్లో నిషేధాజ్ఞలను ఆగస్టు 18 వరకు అధికారులు పొడిగించారు. మంగళవారం దాకా ఇద్దరి కంటే ఎక్కువ మంది ఒకచోట చేరొద్దని, ఎటువంటి ఆయుధాలను కలిగి ఉండొద్దని, సమావేశాలు నిర్వహించొద్దని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ తెలిపారు.

ఆదివారం మధ్యాహ్నం నాటికి డీజే హల్లి, కేజీ హల్లి స్టేషన్‌లలో 52 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్టు డీసీపీ శరణప్ప ధ్రువీకరించారు. ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. 264 మంది నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. కాగా, 24 ఏళ్ల సయ్యద్ నదీమ్ మరణంతో అల్లర్లలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కాగా, పోలీసు బృందాలు తమ ఇళ్లల్లోకి చొరబడి యువకులను లాక్కెళ్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అల్లర్ల సమయంలో ఇంటిలోనే ఉన్నారని చెబుతున్నప్పటికీ కారణాలేమిటో చెప్పకుండా, అరెస్టు వారెంట్ చూపించకుండానే తమ పిల్లలను తీసుకెళ్లారని ఓ మహిళ ఆరోపించింది. ఇప్పటికీ వారెక్కడున్నారో సమాచారమివ్వలేదని అన్నారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలతో అరెస్టులు చేస్తున్నామని, మరికొందరిని విచారించి అమాయకులైతే వదిలివేస్తున్నామని డీసీపీ శరణప్ప తెలిపారు.

పులకేశి నగర్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తికి బీజేపీ ప్రభుత్వం సెక్యూరిటీని కల్పించలేదని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ విమర్శించారు. అల్లర్లపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని, అల్లర్లు జరిగి ఐదు రోజులు గడిచినప్పటికీ ఇంకా సెక్యూరిటీ ఇవ్వలేదని ఆరోపించారు. ఆగస్టు 11 రాత్రి బెంగళూరులోని కేజీ హల్లి, డీజే హల్లి పోలీసు స్టేషన్ పరిధి ఏరియాల్లో అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. భారీగా వాహనాలను తగులబెట్టారు. ఎమ్మెల్యే మూర్తి ఇంటిని ధ్వంసం చేశారు.



Next Story

Most Viewed