విద్యార్థుల ప్రాణాలతో సర్కార్ చెలగాటం.. సమస్యలు పట్టించుకోరా.?

by  |
విద్యార్థుల ప్రాణాలతో సర్కార్ చెలగాటం.. సమస్యలు పట్టించుకోరా.?
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోపాలరావుపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం విద్యార్థులను, పేరెంట్స్‌ను భయాందోళనకు గురిచేస్తోందని పినపాక ఎంపీటీసీ సంఘం అధ్యక్షులు చింతపంటి సత్యం అన్నారు. మంగళవారం గోపాలరావుపేట గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఆయన సందర్శించి, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీటీసీ సత్యం మాట్లాడుతూ.. గ్రామంలో పేరుకే మాత్రమే బడి ఉన్నదని, బడి బయట చెట్ల కింద పాఠాలు బోధిస్తున్నారని వివరించారు. పాఠశాల నిర్మాణం చేసి 40 సంవత్సరాలు గడిచిపోయిందని.. పాఠశాల పైకప్పుల పెచ్చులు ఊడి పిల్లల మీద పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వర్షాకాలంలో విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులకు గుర్తు చేశారు.

ప్రతీరోజు పాఠశాల పైకప్పులు ఊడిపడటంతో పాఠశాల భవనం ప్రమాద అంచుల్లో ఉందని విద్యాశాఖ అధికారులకు ఆయన తెలియజేశారు. దీనికి తోడు విద్యార్థిని, విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే స్కూల్ భవనాన్ని చూసి ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రమాద అంచుల్లో ఉన్న పాఠశాల భవనాన్ని ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే పాఠశాల భవనాన్ని కూల్చివేసే విధంగా చర్యలు తీసుకొని.. నూతన భవనాన్ని ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలని విద్యార్థులు, పేరెంట్స్, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.

Next Story

Most Viewed