‘అలా కరోనాకు కళ్లెం వేశాం’

by  |
‘అలా కరోనాకు కళ్లెం వేశాం’
X

ముంబయి: డబ్ల్యూహెచ్‌వో ప్రశంసలకు మహారాష్ట్ర సర్కారు ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం కరోనాకు కళ్లెం వేయడంలో ధారావి ప్రపంచానికే రోల్ మోడల్‌గా మారిందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొనియాడారు. ఇక్కడ కరోనా కట్టడిపై బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు మాట్లాడారు. ధారావిలో కరోనా కట్టడికి ట్రేసింగ్, ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ అనే పద్ధతిని అవలంబించినట్టు తెలిపారు. పేషెంట్ల కోసం ఎదురుచూడకుండా ముందస్తుగా ఇంటింటికి తిరిగి స్క్రీనింగ్‌లు చేశామని, ముందుగానే అనుమానితులను కనిపెట్టి ప్రభుత్వ క్వారంటైనమ్‌సెంటర్‌లకు తరలించామని బీఎంసీ అధికారి కిరణ్ దిగావ్కర్ తెలిపారు.

కనీసం ఆరు నుంచి ఏడు లక్షల మందిని ధారావిలో థర్మల్ స్క్రీనింగ్ చేశామని, 14వేల మందికి టెస్టులు జరిపామని, 13వేల మందిని క్వారంటైన్‌లో ఉంచామని వివరించారు. ఈ కార్యంలో ప్రైవేటు ప్రాక్టీషనర్ల సహకారం తీసుకున్నామని, వారందరికీ పీపీఈ కిట్లు అందించి ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. అనంతరం వారిని క్లినిక్‌లు తెరుచుకోమని చెప్పి, అనుమానితులెవరైనా వస్తే తెలియజేయాల్సిందిగా కోరామని, ఇలా ముందుగానే కరోనా పేషెంట్లను గుర్తించి వ్యాప్తి నిరోధించగలిగామని వివరించారు.

అంతేకాదు, స్థానిక క్లినిక్‌లోనూ కరోనా ట్రీట్‌మెంట్ సూచనలు ఇచ్చారని చెప్పారు. అలాగే స్థానికుల(కమ్యూనిటీ లీడర్లు) సహాకారమూ తీసుకుని పేషెంట్లను ముందుగానే గుర్తించే బాధ్యత అప్పగించామని తెలిపారు. క్వారంటైన్ సదుపాయాల కోసం పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులను వినియోగించారు. ధారావిలో 80శాతం ప్రజలు 450 సామూహిక టాయిలెట్లనే వాడుతారు. ఈ టాయిలెట్ల శుభ్రత, ఇక్కడా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా 2.5 కిలోమీటర్ల పరిధి విస్తరించి సుమారు ఐదున్నర లక్షల మంది నివసించే ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో కరోనాకు అడ్డుకట్ట వేశారు.

Next Story

Most Viewed