టీకాపై ఆసక్తి చూపని ప్రైవేట్‌ హెల్త్ కేర్ సిబ్బంది

by  |
టీకాపై ఆసక్తి చూపని ప్రైవేట్‌ హెల్త్ కేర్ సిబ్బంది
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రైవేటు హెల్త్ కేర్ సిబ్బంది టీకాలపట్ల పెద్దగా ఆసక్తి చూపడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది. తొలి రోజున 42,915 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేయాలని ప్రజారోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అందులో సగం మంది కూడా హాజరుకాలేదు. 20,395 మంది మాత్రమే హాజరయ్యారని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సిన్ పంపిణీ చేయగా 64% మందికి ఇవ్వగలిగామని మీడియాకు వివరించారు.

ఇప్పటివరకు 1.30 లక్షల మందికి టీకాలు ఇచ్చామన్నారు. 2.14 లక్షల మంది ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ‘కొవిన్’ సాఫ్ట్‌వేర్‌లో పేర్లు నమోదైనవారందరికీ టీకాలు ఇవ్వాలని భావించి నోడల్ అధికారులను నియమించామని తెలిపారు. అయినా మొదటి రోజున సగం మంది కూడా రాలేదని, వీలైనంత ఎక్కువ మంది టీకాలు తీసుకునేలా అన్ని ఆసుపత్రులకు అర్థం చేయిస్తామని తెలిపారు. వ్యాక్సిన్ ‘నిర్బంధం’ కాకపోయినా అవసరంగా, బాధ్యతగా భావించాలని డాక్టర్ శ్రీనివాసరావు నొక్కిచెప్పారు.

పెండింగ్ నిర్మాణాలను పూర్తి చేయాలి

ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉంటే వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న ప్రతి భవనానికీ పూర్తిస్థాయిలో సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు. వైద్య పరికరాలు, మందులు, పెండింగ్ బిల్లులు వివరాలను అందజేయాలని కోరారు. వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి, తెలంగాణ వైద్య మౌలిక వసతుల కార్పొరేషన్ ఎండి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి రాజేంద్ర కుమార్ తదితరులతో సచివాలయంలో సోమవారం సమావేశమైన మంత్రి పై విషయాలను స్పష్టం చేశారు. వీలైనంత తొందరగా ఆసుపత్రులన్నింటినీ అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

రియాక్షన్లకు ‘నిమ్స్’లో చికిత్స

కరోనా టీకా తీసుకున్న తర్వాత వచ్చే రియాక్షన్ల చికిత్సకు 51 ఆసుపత్రులను సిద్ధం చేసినప్పటికీ, వాటికి బదులుగా ‘నిమ్స్’ ఆసుపత్రిలోనే చికిత్స అందించాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. టీకా తీసుకున్న తర్వాత ప్రధానంగా ఛెస్ట్ పెయిన్ వస్తున్నట్లు గుర్తించిన వైద్యులు, అధికారులు తెలంగాణలో చనిపోయిన ఇద్దరిలోనూ అవే లక్షణాలు ఉన్నాయన్న నిర్ధారణకు వచ్చారు. దీంతో సీరియస్ వైద్య చికిత్స అందించాలన్న ఉద్దేశంతో సైడ్ ఎఫెక్టులు, రియాక్షన్లు వచ్చినట్లయితే నేరుగా ‘నిమ్స్’ ఆసుపత్రికే తరలించాల్సిందిగా అన్ని జిల్లాల వైద్యాధికారులకు ఆదేశాలు వెళ్ళాయి.

వ్యాక్సిన్ కేంద్రాలకు అనుబంధంగా సమీపంలోని ఆసుపత్రులలో ఐసీయూ వార్డులను నెలకొల్పినా వైద్యారోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చికిత్స ఎలా ఉండాలనేదానా మీద నిపుణుల బృందం సోమవారం కోఠిలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. చనిపోయిన ఇద్దరు హెల్త్‌కేర్ వర్కర్ల మృతికి దారితీసిన కారణాలను వైద్యారోగ్య శాఖ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. రిపోర్టులు రావడానికి మరో రెండు వారాల సమయం పడుతుందని డా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


Next Story

Most Viewed