ఖైదీలు పప్పులో కాలు వేశారు

by  |
ఖైదీలు పప్పులో కాలు వేశారు
X

దిశ, వెబ్‌డెస్క్: తప్పించుకున్న ఖైదీలు పప్పులో కాలు వేశారు. సాధారణంగా జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు ఆ చుట్టు పక్క జిల్లాల్లో కూడా సంచరించారు. కానీ, వీరు ఎక్కడి నుంచి అయితే పారిపోయారో మళ్లీ అక్కడికే వచ్చారు. దీనికి తోడు మరో దొంగతనాన్ని వెంటేసుకొచ్చారు. ఇది పసిగట్టిన అధికారులు నిందితుడిని అదులోకి తీసుకొని.. మిగతా ఖైదీల కోసం గాలింపు చేస్తున్నారు.

అసలేమైందంటే…

క్రైమ్ చేసి చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు ఖైదీలకు కరోనా వచ్చింది. దీంతో గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకోవడానికి వచ్చారు. బయటి లోకాన్ని చూసేవరకు ఆశపుట్టిందో ఏమో గానీ పెద్ద పథకం వేశారు. సినీ ఫక్కీ తరహాలో బాత్‌రూమ్ వెళ్లిన నలుగురు గ్రిల్స్ తొలగించారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా హాస్పిటల్ బయటకొచ్చి పరారీ అయ్యారు. ఈ ఘటన గత నెల 27న సంచలనం రేపింది. ఖైదీలు తప్పించుకుపోయిన వ్యవహారాన్ని పోలీసులు చాలెంజ్‌గా తీసుకున్నారు.

గాంధీ హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన ఖైదీలు ఓ ఆటో మాట్లాడుకొని ముందుగా శంషాబాద్ వెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా కర్ణాటకలోని గుల్బర్గా‌కు మకాం మార్చారు. అక్కడ కూడా దొంగతనాలు చేసేందుకు ప్రయత్నించారు. ఈ నలుగురిలో జావిద్ అనే ఖైదీ ప్లాన్‌ను నచ్చని నరసింహ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత మిగతా ముగ్గురు కలిసి 9 బైకులను చోరీ చేశారు. ఇవే బైకులతో హైదరాబాద్‌కు వచ్చిన సోమ సుందర్ నార్త్ జోన్ పోలీసుల కంటబడ్డాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న బాలానగర్‌ పోలీసులు మిగతా ఖైదీల కోసం గాలిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేకించి ఓ టీమ్ కర్ణాటకకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఎంతో కష్టపడి పోలీసుల నుంచి తప్పించుకుంటే.. తిరిగి మళ్లీ వాళ్లకే దొరకడంతో ఖైదీలు తలలు పట్టుకున్నారు. అయితే, పట్టుబడ్డ సోమ సుందర్ పై 57 దొంగతనం కేసులు ఉండటం గమనార్హం.


Next Story