కనీవినీ ఎరుగని స్థాయిలో వ్యాక్సినేషన్ : ప్రధాని మోడీ

by  |
PM Modi
X

న్యూఢిల్లీ: సాధారణంగా ఒక టీకాను అభివృద్ధి చేయడానికి కొన్ని సంవత్సర కాలం పడుతుందని, కానీ, మనదేశంలో అత్యల్ప సమయంలోనే ఏకంగా రెండు టీకాలు అందుబాటులోకి వచ్చాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రతిఒక్కరూ టీకా ఎప్పుడు వస్తుందని ప్రశ్నలు గుప్పించారని, ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. దేశ ప్రజలందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. స్వల్ప సమయంలోనే టీకాను తీసుకువచ్చినందుకు శ్రమించిన శాస్త్రజ్ఞులను ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని భారత ప్రధాని మోడీ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రారంభించారు. దేశంలోని సుమారు మూడు వేల సెషన్ సైట్‌లు ఈ కాన్ఫరెన్స్‌కు లింక్ చేశారు. లబ్దిదారులకు అభినందనలు తెలుపుతూ టీకా అత్యావశ్యకమైనవారికి ముందుగా అందుతున్నదని పేర్కొన్నారు. లబ్దిదారులు రెండు డోసులను తీసుకోవడం మరవొద్దని, నెల రోజుల ఎడంతో రెండు డోసులు వేసుకోవాలని తెలిపారు. టీకా వేసుకున్న తర్వాతా కరోనాపై అజాగ్రత్తగా మెలగవద్దని హెచ్చరించారు. టీకా వేసుకున్న 14 రోజుల తర్వాతే దేహంలో వ్యాధి నిరోధకశక్తి పుడుతుందని చెప్పారు.

ఇప్పుడు 3 కోట్లు.. మరో దఫాలో 30 కోట్లు

ప్రపంచం ఇది వరకు చూడని స్థాయిలో, చరిత్రలోనూ కనీవినీ ఎరుగని భారీ టీకా పంపిణీ కార్యక్రమం భారత్‌లో మొదలైందని ప్రధాని అన్నారు. ప్రపంచంలో మూడు కోట్ల జనాభాలోపున్న దేశాలు సుమారు 100 ఉన్నాయని, అలాంటిది భారత్ తొలి విడతలోనే మూడు కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నదని పేర్కొన్నారు. రెండో దఫాలో 30 కోట్ల మందికి టీకా వేయాలని అన్నారు. రెండో విడతలో వయోధికులు, దీర్ఘకాలికవ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉన్నదని తెలిపారు. టీకా సామర్థ్యంపై ప్రజలు వదంతులు నమ్మవద్దని సూచించారు. కరోనాపై భారత పోరును యావత్ ప్రపంచమే గుర్తించిందని చెప్పారు. ఆ పోరాటమే భారత ఆత్మ విశ్వాసానికి, ఆత్మ నిర్భరతకు నిదర్శనమని తెలిపారు. ఇప్పుడు అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్న భారత్‌వైపే ప్రపంచ దేశాలు ఆశగా చూస్తున్నాయని వివరించారు. భారత టీకా శాస్త్రజ్ఞులను, వైద్యారోగ్య వ్యవస్థలపై విదేశాలకూ నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు.

ఎదుటివారి కోసం ప్రాణాలే వదిలారు

కరోనా సంక్షోభ తొలినాళ్లను ప్రధాన మంత్రి గుర్తుచేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. కరోనాను ఎదుర్కోవడంలో భారత్ చూపించిన తెగువ అసమానమని, ప్రతి భారతీయుడు ఈ పోరాటంలో పాల్గొన్నారని చెప్పారు. ముఖ్యంగా డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంబులెన్స్ డ్రైవర్లు, పోలీసులు, పారిశుధ్య కార్మికుల సేవలు అద్వితీయమని ప్రశంసించారు. ఫ్రంట్‌లైన్ కార్మికులు ఎదుటివారి ప్రాణాల కోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేశారని గుర్తుచేసుకున్నారు. కొందరు కరోనా పోరులోనే ప్రాణాలొదిలారని, ఇంటి నుంచి బయల్దేరి మళ్లీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని అన్నారు. కరోనా కారణంగా కనీసం అంతిమ క్రియలూ చేపట్టలేని దైన్యాన్ని అనుభవించామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసిద్ధ తెలుగు కవి గురజాడ అప్పారావు రచనను ఉటంకించారు. ‘సొంత లాభం కొంత మానుకో, పొరుగువాడికి తోడుపడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అనే పాదాలను పలికారు.



Next Story

Most Viewed