పంటల కొనుగోళ్లకు ఏర్పాట్లు

by  |
పంటల కొనుగోళ్లకు ఏర్పాట్లు
X

దిశ, మహబూబ్‌నగర్: పంటలు చేతికి అందుతున్న సమయంలో కరోనా రూపంలో విపత్తు యావత్తు ప్రపంచం పై పడింది. కోవిడ్-19 మహమ్మారి కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులు తమ పంటలు విక్రయించేందుకు ఆగమాగం కావొద్దని, ప్రభుత్వం ప్రతి గింజా కొంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడిన ఆయా జిల్లా కలెక్టర్లు అసలు జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల పంటలు సాగు చేశారు? ఎంత పంట చేతికి వచ్చే అవకాశం వుంది, అవి ఎప్పటిలోగా రావచ్చు అనే విషయాలపై ఆరా తీశారు. అలాగే పంటలను నిల్వ ఉంచేందుకు కావాల్సిన గోదాంలనూ సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులకు జిల్లా కలెక్టర్లు అదేశాలు జారీ చేశారు. పంటల కోతల కోసం కావాల్సిన వరి కోత యంత్రాలు ఎన్ని వాటికి కావాల్సిన పరికరాలు ఏమిటనే విషయాలపై కూడా అధికారులు లెక్కలు వేస్తున్నారు.

కొనుగోలు కేంద్రాలు సిద్ధం..

మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 225 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. సుమారు 96,730 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 177 కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమవగా, అక్కడ 1,44,859 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చేలా ఉందనీ, వనపర్తిలో 214 కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమవగా, ఇక్కడ 2,37,000 మెట్రిక్ టన్నుల వచ్చేలా ఉందనీ, జోగుళాంబ గద్వాల జిల్లాలో 9 కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా ఇక్కడ 1,05,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందనీ, నారాయణపేట జిల్లాలో 1,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ ఏర్పాట్లపై అధికారులు ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారు. అధికారులు ముందుగానే గ్రామాల్లో పర్యటించి మార్కెట్ యార్డులకు ఎవరూ ధాన్యం తీసుకురాకుండా చూడాలనీ, వారి, వారి గ్రామాలలోనే ధాన్యం కొనుగోలు చేస్తామనే విషయాన్ని సంబంధిత గ్రామ ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలని సూచించారు. దీని కోసం రైతులకు కావాల్సిన టొకన్లను జారీ చేసి వారికి ఇచ్చిన తేదీ నాడు మాత్రమే ధాన్యం తీసుకొచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రస్తుతం జిల్లాలో ఎక్కువగా వరి సాగు అవుతుండటంతో వరి గ్రేడ్ ఏ రకానికి రూ.1835, సాధారణ రకానికి రూ.1815 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందనీ, అలాగే మొక్క జొన్నకు రూ.1760, పపుశనగకు రూ.4875లను మద్దతు ధరగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అయితే, మొక్కజొన్న, పపుశనగ పంటలను తగినంత అరబెట్టిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతు తమ వెంట అధార్ కార్డు జీరాక్స్, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ పాస్ పుస్తకం తీసుకుని రావాలని తెలిపారు. వీటితో పాటు వీఆర్వో, వీఏవోలచే వారు సాగు చేసిన పంట ధ్రువీకరణ పత్రాలను వెంట తీసుకురావాలన్నారు.

Tags: crop buying centres, preparations, paalamooru dist, corona effect

Next Story

Most Viewed