పుంజుకున్న బంగారం విక్రయాలు

by  |
పుంజుకున్న బంగారం విక్రయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ధన్‌తేరాస్‌ను సాధారణంగా ఉత్తర, పశ్చిమ భారత్‌లొ జరుపుకుంటారు. గత కొన్నేళ్లుగా ఇది దక్షిణ భారత్‌లోనూ కొంత విస్తరిస్తోంది. ధన్‌తేరాస్ రోజున బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను కొనేందుకు శుభదినం(దీపావళికి ముందు వచ్చే రోజు)గా భావిస్తారు. అయితే, ఈ ఏడాది రెండు రొజుల పాటు ఇది రావడంతో బంగారం అమ్మకాలకు కలిసొచ్చింది. ఈ ఏడాదిలో కరోనా మహమ్మారి కారణంగా బంగారం ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ రెండు రోజుల క్రితం భారీగా తగ్గింది.

ఈ పరిస్థితులు బంగారం కొనుగోలుదారులకు కలిసి వచ్చిందని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా, ఇన్నాళ్లు అమ్మకాలు లేక డీలాపడిన పరిశ్రమకు ధన్‌తేరాస్ సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కానీ, కరోనా వల్ల క్షీణించిన డిమాండ్‌ను భర్తీ చేసే స్థాయిలో అమ్మకాలు లేకపోయినప్పటికీ శుక్రవారం అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు. కొవిడ్-19 వ్యాప్తి ఆందోళనలతో స్టోర్‌కు వెళ్లలేని కస్టమర్లు ముందుగానే బుక్ చేసుకున్నవారు శుక్రవారం డెలివరీ అందుకున్నట్టు, మరికొందరు తనిష్క్, మెలోరా వంటి ఆన్‌లైన్ బ్రాండ్‌ల ద్వారా ఆన్‌లైన్ కొనుగోళ్లు జరిపారని ఆలిండియా జెమ్‌ అండ్‌ జ్యువెలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అనంత పద్మనాభన్‌ చెప్పారు.

విలువైన పసిడి, వెండి కొనలేని వారు, ధన్‌తేరాస్ సందర్భంగా సాధారణ లోహాలతో సరిపెట్టినట్టు తెలుస్తోంది. ‘కొనుగోలుదారులు నెమ్మదిగా కొనుగోళ్లకు సిద్ధపడుతున్నారు. కరోనా నేపథ్యంలో గతేడాది ధన్‌తేరాస్ స్థాయిలో అమ్మకాలు లేకపోయినప్పటికీ..ప్రస్తుత డిమాండ్‌ను కొంతైనా భర్తీ చేసే స్థాయిలో కొనుగోళ్లు జరిగినట్టు భావిస్తున్నామని’ ప్రపంచ స్వర్ణ మండలి కౌన్సిల్ ఎండీ(ఇండియా) సోమసుందరం పేర్కొన్నారు. ఇటీవల తగ్గిన బంగారం ధరలు డిమాండ్ పుంజుకునేందుకు దోహదపడుతుందని, పరిమాణంలో పసిడి అమ్మకాలు 20 శాతం వరకు తగ్గినా, విలువ పరంగా గతేడాది స్థాయిలో ఉండొచ్చని భావిస్తున్నట్టు ఆభరణాల నిపుణులు వెల్లడించారు.

Next Story

Most Viewed