మాకు వెంటనే సీసీ ఫుటేజీ కావాలి.. ‘మా’ ఈసీకి ప్రకాష్ రాజ్ లేఖ

by  |
Prakash Raj
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాల్సిందిగా ఎన్నికల అధికారి కష్ణమోహన్‌కు ప్రకాశ్‌రాజ్ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయని, బయట వ్యక్తులు కూడా వచ్చి ఓటు వేశారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆలస్యమైతే ఆ వీడియో ఫుటేజీ డిలిట్ చేసే అవకాశం ఉందని, వీలైనంత తొందరగా అందజేయాలని, ఆ ఫుటేజీని కోరడం తమకున్న ప్రజాస్వామిక హక్కు అని పేర్కొన్నారు. ఎన్నికల అధికారిగా అందజేయడం ఒక బాధ్యత అని పేర్కొన్నారు. నటుడు మోహన్‌బాబు, నరేష్ అసాంఘికమైన తీరులో ప్రవర్తించారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, కొద్దిమందిని బెదిరించారని, మరో సందర్భంలో పరుష పదాజాలాన్ని వాడారని, మరికొద్దిమందిపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయని, ప్రజలకు కూడా అదే అభిప్రాయం ఉన్నదని ఆ లేఖలో ప్రస్తావించారు. ‘మా’ సభ్యులుగా వాస్తవాలను తెలుసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో సీసీటీవీలను వాడినట్లు స్పష్టంగా పేర్కొన్నందున మొత్తం ప్రక్రియ రికార్డు అయ్యి ఉంటుందని గుర్తుచేశారు. పోలింగ్ అధికారిగా ఆ వీడియో ఫుటేజీని కనీసం మూడు నెలల పాటు భద్రపర్చడం బాధ్యత అని కృష్ణమోహన్‌కు ఆ లేఖలో వివరించారు. గతంలో సుప్రీంకోర్టు సైతం పలు కేసుల్ని విచారించి తీర్పుల్లో ఈ విషయాన్ని పేర్కొన్నదని గుర్తుచేశారు. ఆలస్యమైతే ఆ వీడియో ఫుటేజీ కూడా మాయమవుతుందేమోననే ఆందోళన, భయం తమకు ఉన్నట్లు ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed