కరోనాతో పౌల్ట్రీ ఢమాల్.. తగ్గిన చికెన్ ధరలు

by  |
chicken prices
X

దిశ, తెలంగాణ బ్యూరో : చికెన్‌పై కరోనా ఎఫెక్ట్ పడింది. ఫంక్షన్లు, సమావేశాలు, సభలకు ప్రభుత్వం ఆంక్షలు విధించడం, నైట్ కర్ఫ్యూతో అమ్మకాలు తగ్గాయి. ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతులు తగ్గడంతో గత నెలలో కిలో రూ.270 ఉన్న ధర ప్రస్తుతం రూ.141కి తగ్గింది. అయినా కొనుగోలు దారులు రాకపోవడంతో చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి.

రాష్ట్రంలో వాణిజ్య డిమాండ్‌ తగ్గడం, పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో గత నెల రోజుల్లోనే కిలో బ్రాయిలర్‌ కోడి మాంసం ధర రూ.270 నుంచి 141కి తగ్గింది. కరోనా ఉధృతితో ఫంక్షన్లు, సభలు, సమావేశాలు వాయిదా పడ్డాయి. సామూహిక భోజనాలుంటేనే కోడిమాంసం అమ్మకాలు బాగా పెరుగుతాయి. అవి లేనందున డిమాండ్‌ 50 శాతం వరకూ పడిపోయింది.

సాధారణంగా తెలంగాణలో రోజుకు సగటున 9 లక్షల కిలోల కోడి మాంసం విక్రయాలుంటాయి. ఇప్పుడు 5 లక్షల కిలోలకు మించి పోవడం లేదు. హోటళ్లలో, బార్లల్లో సాధారణంగా రాత్రిపూట అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ తో అమ్మకాలు మరింత తగ్గాయి. కర్ణాటక, మహారాష్ట్రలో లాక్‌డౌన్‌తో.. తెలంగాణ నుంచి ఆ రాష్ట్రాలకు కోళ్ల రవాణా తగ్గింది. మరోవైపు మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని సరిహద్దు జిల్లాలకు కోళ్లను తక్కువ ధరకు తరలిస్తుండటం కూడా రాష్ట్రంలోని ఫౌల్ట్రీరంగంపై పడింది.

కరోనా తగ్గి.. డిమాండ్ పెరుగుతుందని…

గతేడాది లాక్ డౌన్‌ ఎఫెక్ట్ పడింది… ఈ ఏడాది కూడా కరోనా వ్యాప్తి తగ్గక పోవడంతో ప్రజలు కూడా అంతగా ఆసక్తి చూపలేదు. కోడి మాంసానికి పెద్దగా డిమాండ్‌ లేకుండా పోయింది. ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి, ఏప్రిల్ రెండవ వారం వరకు డిమాండ్‌ పెరిగింది. దీంతో చికెన్ ధర ఒకేసారి రూ. 270కి చేరింది. లాభాలు వస్తాయని భావించిన రైతులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపారు. ఫాంలలో అధికంగా పెంచారు. మళ్లీ విక్రయాలు తగ్గడంతో నష్టం వస్తోందని కోళ్ల రైతులు తెలిపారు. అసలే వేసవి కాలం కావడంతో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే కోడి పిల్లలను కాపాడటం కష్టమే. కిలో బరువు కోడిని పెంచాలంటే సగటున రూ.90 వరకూ రైతు పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు కిలో బరువున్న కోడిని రూ.91కే మాంసం వ్యాపారులకు విక్రయించడం వల్ల రైతులకు నష్టం వస్తోంది.

షాపు ఖర్చులు కూడా వెల్తల్లేవ్..

కేజీ కోడి మీద రూ.3 గిట్టుబాటు అవుతది. రెండు కేజీలు ఉంటే సాయంత్రం వరకే అమ్మాలి.లేకపోతే చనిపోవడమే.. వెయిట్ తగ్గడమో జరుగుతుంది. అలా అయితే 100ల రూపాయలు నష్టపోవడం జరుగుతుంది. దీంతో నష్టమైనా సరే ఆ రోజే అమ్మేలా చూస్తున్నాం. శుభకార్యాలయాలు, సమావేశాలు లేక పోవడంతో ఆర్డర్స్ వస్తలేవు. మేము కూడా కోళ్ల వ్యాపారుల నుంచి తక్కువ కోళ్లను ఆర్డర్ చేస్తున్నాం. వచ్చేలాభం షాపు కిరాయికి కూడా సరిపోయే పరిస్థితి లేదు. పనిచేసేవాళ్లకు జీతం ఇచ్చేందుకు అప్పు చేయాల్సిందే.
-అమ్జద్, డైమాండ్ చికెన్ సెంటర్, వెంకటగిరి, జూబ్లీహిల్స్


Next Story

Most Viewed