అమ్ముడుపో‘కుండ’.. !

by  |
అమ్ముడుపో‘కుండ’.. !
X

దిశ, రంగారెడ్డి: రెక్కాడితే కానీ, డొక్కాడని కులవృత్తులకు నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌‌డౌన్‌తో కష్టాలు వచ్చాయి. వెంట్రుకలు కత్తిరించకుంటే, మగ్గం నేయకుంటే, కల్లు గీయకుంటే, బట్టలు ఉతకకుంటే.. ఈ విధంగా ఏ వృత్తి వారైనా ఆ పని చేయకుంటే పూట గడవదు. కుమ్మరి వృత్తిదారులు కుండలు చేసి అమ్మకుంటే అదే పరిస్థితి ఉంటుంది. వాస్తవంగా మార్చి నెల నుంచి జూన్ వరకు మాత్రమే మట్టిపాత్రలకు క్రయవిక్రయాలు జరుగుతాయి. కానీ, లాక్‌డౌన్‌తో అమ్మకాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో అనేక కుటుంబాల్లో దుర్భర పరిస్థితి ఏర్పడింది. మార్చి నెల చివరి వరకు పూర్తిస్థాయిలో మట్టి పాత్రలు సరఫరా జరగాలి. కానీ, సరఫరా చేయలేకపోయారు. ఈ నెలలో కూడా సరఫరా చేయకపోతే ఏడాదంతా పస్తులుండాల్సిందేనని కుమ్మరి కులవృత్తిదారులు వాపోతున్నారు. తమను ప్రభుత్వం ప్రత్యేక మార్కెట్లు పెట్టుకునేందుకు అనుమతించి ఆదుకోవాలని కోరుతున్నారు.

జిల్లాలో 1,500 కుటుంబాలు..

కుమ్మరి వృత్తిలో నిమగ్నమైన కుటుంబాలు తక్కువే. కానీ, వారు తయారు చేసిన పాత్రలను విక్రయించి వ్యాపారులు చేసేవారు అధికంగానే ఉన్నారు. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం కుండల తయారీకి పెట్టింది పేరు. ఇక్కడ సుమారు 1,500 కుటుంబాలు కేవలం కులవృత్తి మీదనే ఆధారపడి ఉంటారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో తీరిక లేకుండా కష్టపడుతారు. ఆ నాలుగు నెలల్లో చేసిన సరుకును నెల లేదా రెండు నెలల్లో విక్రయించాలి. లేకపోతే సవంత్సరం అంతా ఆ పాత్రలను ఇంట్లోనే ఉంచుకోవాలి. దీంతో వారికి ఇబ్బందులు తప్పవు.

ఇదే సీజన్..

కుమ్మరి వృత్తివారికి ఇప్పుడే సీజన్. ఉగాది పండుగ మొదలుకొని.. పెండ్లిళ్లు, కల్లు ముంతలు, ఎండాకాలంలో చల్లటి కుండలు విక్రయాలు ఇప్పుడే. కానీ, లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. అయితే, ఈ సమయంలో వారు ముందస్తుగా చెరువుల మట్టి తీసుకొచ్చుకోవాలి. వచ్చే సీజన్‌కు మట్టిని
రెడీగా పెట్టుకోవాలి. కానీ, లాక్‌డౌన్‌తో ఇవేవీ జరగడం లేదు. వీటన్నింటికీ ప్రభుత్వం అనుమతించాలని వారు కోరుతున్నారు.

లక్షల రూపాయల నష్టం..

వికారాబాద్ జిల్లాలోని తాండూర్, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల్ మండలంలోని గ్రామాల్లో కుండలు, రంజాన్లు తయారీ చేస్తారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, జహీరాబాద్, సోలాపూర్, సెడం ప్రాంతాలకు వీటిని ఎగుమతి చేస్తారు. ఈ ఎగుమతి నిలిచిపోవడంతో కుమ్మరి వృత్తి దారులు లక్షల రూపాయలను నష్టపోతున్నారు. ఈ మట్టి కుండల సరఫరా‌కు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు వినతిపత్రం సమర్పించారు.

ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేయాలి..

ప్రభుత్వం కుమ్మరి వృత్తిదారులను ఆదుకోవాలి. నోవెల్ కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో కుండలు అమ్ముకొనలేకపోయాం. తయారు చేసిన కుండలు ఇంట్లోనే నిలిచిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం స్పందించి తయారు చేసిన కుండాలను విక్రయించేందుకు ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు
చేయాలి.

– కుమ్మరి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్.రాజమల్లు

Tags: Lockdown, Pottery, professionals, special market, covid 19, effect, no transport

Next Story

Most Viewed