అటకెక్కిన బల్దియా చాలెంజ్​

by  |
అటకెక్కిన బల్దియా చాలెంజ్​
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : అడుగడుగునా గుంతలు.. ఏమరపాటుగా ఉంటే వెన్ను విరిగే ప్రమాదం.. ఇదీ మహానగర రహదారుల చిత్రం.. వాన దెబ్బతో గ్రేటర్ హైదరాబాద్ అసలు రూపం మరోసారి తేటతెల్లమవుతోంది. రోడ్లపై గోతులు పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా దర్శనమిస్తున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సరిగ్గా ఐదేళ్ల క్రితం హైదరాబాద్ లో ‘గుంత చూపండి.. వెయ్యి రూపాయాలు తీసుకొండి’ అని నాటి గ్రేటర్ మున్సిపల్ కమిషనర్, ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. సోమేశ్ కుమార్ రాష్ట్రంలోనే అత్యున్నత పదవిలో కొనసాగుతున్నా నగర రోడ్లపై గుంతల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు కన్పించడంలేదు. వాహన దారులు, పాదచారులకు గుంతల గోస తీరడం లేదని సిటీజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నాటి హామీలు వాన మూటలేనా..?

రోడ్లపై ఒక్క గుంతా లేకుండా చేస్తామని 2014 ఆగస్టు లో జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం ప్రకటించింది. ఇందుకు తమకు కనీసం మూడు మాసాల సమయం కావాలని చెప్పింది. ఆ తర్వాత రహదారులపై పాట్‌హో ల్స్ గుర్తించిన వారికి నజరానా ఇస్తామని గొప్పలు చెప్పుకుంది. ఎక్కడ గుంత కనబడినా వెంటనే మరమ్మతులు చేసేందుకు ప్రత్యేక యంత్రాలను సమకూర్చుకుంటామని నాటి బల్దియా కమిషనర్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. ప్రత్యేక వాహనాలతో కాంక్రీట్ మిక్స్‌తో గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చివేస్తామని నమ్మబలికా రు. వర్షాకాలంలో సైతం పనులు చేయవచ్చునని హడా విడి చేశారు. ఢిల్లీలో ఈ విధానం అమలులో ఉంది. అక్కడ మంచి ఫలితాలు రావడంతో నగరంలో ఈ విధానాన్ని వినియోగంలోకి తెస్తున్నట్లు అధికారులు తెలిపారు. తొలిదశలో అద్దె ప్రాతిపదికన యంత్రాలను వినియోగంలోకి తేనున్నామని, పూడ్చివేసిన గుంతల పరిమాణాన్ని బట్టి కాంట్రాక్టర్​కు బిల్లులు చెల్లిస్తామని ప్రకటించారు. ఒక యంత్రం ద్వారా రోజుకు దాదాపు 50 పాట్‌హోల్స్‌ను పూడ్చివేయవచ్చునని, పూడ్చివేసిన గుం త ఏడాదిలోగా దెబ్బతిన్నా కాంట్రాక్టు సంస్థే తిరిగి పనిచేయాల్సి ఉంటుంది. తొలుత ప్రధాన రహదారుల్లోని పాట్‌హోల్స్‌కు మరమ్మతులు చేయాలని భావిస్తున్నట్లు తెలిపి, ఐదేళ్లు గడిచినా ఇప్పటికి ఒక్క అడుగు ముందుకు సాగలేదు.

గుంత సవాల్ ఏమైంది..?

జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 6వేలకు పైగా రహదారులు విస్తరించి ఉన్నాయి. వీటి మరమ్మతుల కోసం ప్రతీయేటా రూ.50 కోట్లు బల్దియా ఖర్చు చేస్తుంది. ఢిల్లీ తరహా నూతన పరిజ్ఞనాన్ని వినియోగంలోకి తీసుకువస్తే .రోడ్లపై గుంతల సమస్యలను అధిగమించవచ్చునని నాటి జీహెచ్ఎంసీ కమిషనర్, సోమేశ్ కుమార్ ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం రోడ్లపై కనబడ్డ పాట్‌హోల్స్ అన్నింటికీ మరమ్మతులు చేయడమే కాక, ఎక్కడ పాట్‌హోల్ కనబడ్డా తెలియజేయాల్సిందిగా ప్రజల నుంచి ఫిర్యాదులు ఆహ్వానించాలని భావించారు. కెమెరా లేదా సెల్‌ఫోన్ ద్వారా సదరు ఫొటోను జీహెచ్‌ ఎంసీకి పంపిస్తే జీపీఎస్ ద్వారా వాటిని గుర్తిస్తామన్నారు. ఇందుకు అవసరమయ్యే సాంకేతిక సహకారానికి మైక్రోసాఫ్ట్ సంస్థతో సంప్రదిం పులు జరుపుతున్నట్లు తెలిపారు. ఇలా మూడు నెలలపాటు ప్రజల నుంచి స్వీకరించే ఫిర్యాదులతో అన్ని పాట్‌హోల్స్ పూడ్చివేస్తామని, ఆ తర్వాత ఎక్కడ పాట్‌హోల్ ఉందని చెప్పేవారికి వెయ్యిరూపాయలు బహుమానంగా ప్రకటిస్తామని జీ హెచ్ఎంసీ యంత్రాంగం చెప్పి ఐదేళ్లు గడిచినా ‘ఎక్కడి గొంగళి అక్కడే’ అన్న చందంగా తయారైందని నగరవాసులు వాపోతున్నారు.

మంత్రివర్యా.. జర దేఖో..

వర్షం పడిన ప్రతీసారి నగర రోడ్లు ఛిద్రమవుతున్నాయి. వాహనదారులు, పాదచారులు రోడ్లపై ప్రయాణించలేని పరిస్థితి. ఒక్కవేళ ధైర్యం చేసి రోడ్లపై కి వచ్చినా ఎక్కడ ఏ గుంత ఉందో తెలియని పరిస్థితి. వాహనం ఏ గొయ్యి లో పడుతుందోనన్న భయం. పాదచారులు గుంతలో పడి కాళ్లు విరగ్గొట్టుకునే దుస్థితి నెలకొంటుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికైనా రోడ్ల మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. నాటి నుంచి నేటి వరకు ఆయనే పురపాలక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. గతంలో బల్దియా అధికారులే గుంతలు లేకుండా చేస్తా మని హామీ ఇచ్చి విఫలమయ్యారు. హామీ ఇచ్చి ఐదేళ్లు గడుస్తున్నా నేటికీ నెరవేరలేదు. మరో రెండు, మూడు నెలల్లో బల్దియా ఎన్నికలున్నాయి. ఇప్పటికైనా రోడ్ల పరిస్థితి బాగు చేయాలని నగర వాసులు కోరుతున్నారు.

Next Story

Most Viewed