పవన్ కల్యాణ్‌పై పోసాని సంచలన వ్యాఖ్యలు.. దాడికి యత్నించిన జనసైనికులు

by  |
Posani Krishna Murali
X

దిశ, ఖైరతాబాద్: ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గత రెండ్రోజులుగా పవన్ కల్యాణ్ ‘సైకో ఫ్యాన్స్’ తన కుటుంబ సభ్యులను దూషిస్తూ ఫోన్లు, మెసేజ్‌లు చేయడం మానుకోవాలని సూచించారు. అభిమానులు పద్ధతి మార్చుకోకుంటే అదే భాషలో సమాధానం చెప్పాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పవన్ చేసిన కామెంట్లను తాను వ్యతిరేకించినందుకే తనపై కక్ష గట్టారని అన్నారు. గతంలో చిరంజీవి కుమార్తె మీద కేశినేని నాని బూతులు మాట్లాడినప్పుడు చిరంజీవి కుటుంబానికి అండగా ఉన్నానని గుర్తుచేశారు.

‘రాజకీయాలకు కుటుంబాలతో సంబంధం లేదు. నా భార్య అంటే నాకు ప్రాణం. నేను నా భార్యను అమితంగా ప్రేమిస్తున్నాను. నీలా నలుగురిని చేసుకొని మోసం చేసిన వ్యక్తిని కాను’’ అని సంచలన ఆరోపణలు చేశారు. చిల్లర మాటలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకే వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘నువ్వు మగాడివే అయితే.. ఫేస్ టు ఫేస్ చూసుకుందాం రా’’ అంటూ సవాల్ విసిరారు.

పోసానిపై దాడికి యత్నం.. పవన్ ఫ్యాన్స్ అరెస్ట్

ప్రెస్‌మీట్ కొనసాగుతుండగానే అభిమానులు ప్రెస్‌క్లబ్ వద్దకు చేరుకొని పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి, లోనికి వచ్చేందుకు యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. ప్రెస్ మీట్ ముగించుకొని పోసాని వెళుతున్న సమయంలో క్లబ్ గేట్లు దూకి నలుగురు యువకులు దూషిస్తూ దాడికి యత్నించారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


Next Story

Most Viewed