రైతు వేదిక కోసం నిరుపేద భూమి

by  |
రైతు వేదిక కోసం నిరుపేద భూమి
X

దిశ, మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతువేదికల కోసం నిరుపేద రైతు భూమి తీసుకున్నారు. జిల్లాలోని అడ్డాకుల మండలం కందురు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ప్రస్తుతం రైతు వేదికను ఏర్పాటు చేయడం వివాదానికి దారిసింది. బాధితులు సత్తయ్య, చిట్టెమ్మల కథనం ప్రకారం.. కందూర్ గ్రామంలో బీసీ కులానికి చెందిన ఈదన్న ముదిరాజ్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నందుకు 1971లో అప్పటి ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఈ భూమిని పంపిణీ చేసింది. అప్పటి నుంచి వారి కుటుంబమే ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ భూమిలో రైతు వేదిక నిర్మాణం కోసం రాత్రికి రాత్రే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బాధిత కుటుంబాన్ని రోడ్డున పడేశారు అధికారులు.

పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వెళ్లామని ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నా నేపథ్యంలో సోంత గ్రామానికి వచ్చామని వారు చెప్పారు. గత పదిహేను రోజులుగా భూమిలో ఉన్న ముళ్లపొద్దలను తొలగించి పంటను సాగు చేసుకుందామని అనుకుంటే అధికారులు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు వేదికకు నిరుపేద భూములే కావాలా అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నపళంగా భూమిని గుంజుకోవడంతో వారి కుటుంబం రోడ్డున పడిందన్నారు. రైతు వేదిక పేరుతో రైతుల భూములను లాక్కోవడం సమంజసం కాదన్నారు.

Next Story