వాకింగ్ ట్రాక్ కోసం చెరువు శిఖం కబ్జా.. అధికారులపై స్థానికుల ఆగ్రహం

by  |
వాకింగ్ ట్రాక్ కోసం చెరువు శిఖం కబ్జా.. అధికారులపై స్థానికుల ఆగ్రహం
X

దిశ, ఇబ్రహీంపట్నం : మున్సిపాలిటీ పరిధిలోని చిన్న చెరువులో ప్రభుత్వం నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్ స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ ప్రోత్సహిస్తూ నిధులు మంజూరు చేయడంపై స్థానికుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇబ్రహీంపట్నం చెరువు శిఖం భూమిలో, ఇప్పటికే అనేక అక్రమ ఇండ్ల నిర్మాణాలు, కట్టడాలు జరిగాయి. చెరువు శిఖం భూమి ఇంతకుముందే చాలా వరకు అక్రమార్కుల వల్ల కబ్జాకు గురైంది.

అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. మిగిలిన చెరువు భూభాగం నీటితో నిండి ఉండేది. ఇప్పుడు ఈ వాకింగ్ ట్రాక్ నిర్మాణంతో చెరువు పూర్తిగా మాయం అవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో నీటిని పంట పొలాలకు విడుదల చేసే రెండు తూములు.. ఈ ట్రాక్ వల్ల శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉంది. అయితే, వాకింగ్ ట్రాక్ నిర్మాణం.. డంపింగ్ యార్డ్‌లోని చెత్తాచెదారంతో జరుగుతున్నదని, ఇది పూర్తిగా నాసిరకంగా, నాణ్యత లేకుండా ఉందని, పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా జరుగుతున్నదని, అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

వర్షాకాలంలో కాల్వలు, వాగుల ద్వారా వచ్చే నీటితో చెరువులో నీటిమట్టం ఏ మాత్రం పెరిగినా కచ్చితంగా వాకింగ్ ట్రాక్ నీట మునగడం ఖాయమని స్థానికులు చెబుతున్నారు. ఈ నిర్మాణానికి నీటి పారుదలశాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మున్సిపల్ శాఖ అధికారులకు లెటర్ వ్రాయడం జరిగిందని, అయినా ఎటువంటి స్పందన లేదని ప్రజలు తెలిపారు. ఈ చెరువు శిఖం ఎఫ్టీఎల్ స్థలంలో వాకింగ్ ట్రాక్ నిర్మాణం నిలుపుదల చేసి, మున్సిపల్ పరిధిలో మరేదైనా అనువైన ప్రదేశంలో నిర్మిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్నాళ్లుగా చెరువులో నీరు ఉండటంతో మత్స్యకారులు చేపల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం పంపిణీ చేసిన చేపపిల్లలను చెరువులో వదిలారు. చెరువును మట్టితో నింపి ట్రాక్ నిర్మాణం జరపడం వల్ల చెరువు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని, తమ జీవనోపాధి కోల్పోవాల్సి వస్తోందని మత్స్యకార్మికులు ఆందోళన చెందుతున్నారు.

పంట పొలాలకు నీరు అందక రైతులు ఇబ్బందులు, చెరువు లేకపోవడంతో భూగర్భ జలాలు అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి వాకింగ్ ట్రాక్ నిర్మాణం నిలిపివేసి, వేరొక ప్రదేశంలో ఏర్పాటు చేసి చెరువు కనుమరుగు కాకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

నీటిపారుదల శాఖ డీఈ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నచెరువు శిఖం భూమిలో జరుగుతున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణం కోసం, నీటిపారుదల శాఖ నుండి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, గతంలో కూడా పట్టణ ప్రగతి పేరుతో పాత ఇల్లు కూలగొట్టి ఆ మట్టిని చెరువులో నింపడాన్ని అడ్డుకున్నామని తెలిపారు.

మున్సిపాలిటీ ఏఈ మల్లికార్జున్..

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఏఈ మల్లికార్జున్ మాట్లాడుతూ.. మేము మా కౌన్సిల్‌లో ఈ చిన్న చెరువు వాకింగ్ ట్రాక్ కోసం ఎటువంటి తీర్మాణ సమావేశం నిర్వహించలేదన్నారు. ఇది పూర్తిగా కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టర్ ఆఫీస్ నిధుల నుండి ప్రొసీడింగ్స్ వచ్చాయి కాబట్టి.. ఇక్కడ తీర్మాణం చేయవలసిన అవసరం లేదన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు.


Next Story

Most Viewed