AP Politics: బాబూ..ఏది నీ మార్కు.. వైసీపీ ఎమ్మెల్యే

by Disha Web Desk 3 |
AP Politics: బాబూ..ఏది నీ మార్కు.. వైసీపీ ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్ర మంత్రి, పలాస వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పలాసలోని ప్రగతి భవన్‌లో డాక్టర్‌ సీదిరి అప్పలరాజు మంగళవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకులం జిల్లాలో రాష్ట్రానికి 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు మార్కు ఏదీ? ఏమైనా చేశారా? మీ ప్రత్యేకత ఏదైనా ఉందా? జిల్లాకు పనికొచ్చే ఒక్క శిలాఫలకమైనా వేశారా? అని ప్రశ్నించారు.

అలానే సిక్కోలు సమగ్రాభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమైందని పేర్కొన్నారు. ఇక సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం టెక్కలి రానున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చరిత్ర తిరగరాయగలిగే సభగా ఈ సభను విజయవంతం చెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే ముందు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వెనుకబడి ఉన్నాయని వేర్వేరు సర్వేలు చెప్పిన మాటలు టీడీపీనే విడుదల చేసింది.. అంటే 14 ఏళ్లు సీఎంగా చేసి చంద్రబాబు ఏమీ చేయలేదని ఒప్పుకున్నట్టే కదా అని మంత్రి నిలదీశారు.

అలానే జిల్లాకు టీడీపీ చేసిందేమిటో..అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి ఒక్క పరిశ్రమ గానీ, పోర్టు కానీ హార్బర్‌ కాని తెచ్చారా అంటూ ఎద్దేవ చేశారు. ఇక సీఎం జగన్‌ 5 ఏళ్ల పాలనలో శ్రీకాకుళం, విజయనగరం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించేందుకు మూలపేట పోర్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి తీసుకువచ్చారని అప్పలరాజు గుర్తు చేశారు.



Next Story