ఎన్నికల కమిషన్ మోడీ బానిస: ఉద్ధవ్ థాక్రే

by Dishafeatures2 |
ఎన్నికల కమిషన్ మోడీ బానిస: ఉద్ధవ్ థాక్రే
X

దిశ, వెబ్ డెస్క్: భారత ఎన్నికల సంఘంపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే మండిపడ్డారు. ప్రధాని మోడీకి ఎలక్షన్ కమిషన్ బానిసలా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన పార్టీ పేరు, పార్టీ ఎన్నికల గుర్తైన విల్లు-బాణం తమదంటే తమదంటూ అటు ఉద్ధవ్ థాక్రే వర్గం, ఇటు ప్రస్తుతం సీఎం ఏక్ నాథ్ శిండే వర్గం వాదిస్తూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఏక్ నాథ్ శిండే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయగా.. శివసేన పార్టీ పేరు, పార్టీ గుర్తును ఏక్ నాథ్ శిండే శివసేనకే కేటాయిస్తూ శుక్రవారం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. 2019లో జరిగి రాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు పోలైన ఓట్లలో 76 శాతం ఓట్లు ఏక్ నాథ్ శిండే వర్గంలోని శివసేనకే ఉన్నాయని, దాని ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ ప్రకటించింది. పార్టీ పేరు, సింబల్ పోయిన నేపథ్యంలో థాక్రే కుటుంబానికి మద్దతుగా వేలాదిగా కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఉద్ధవ్.. ఎన్నికల కమిషన్, మోడీపై విరుచుకుపడ్డారు. మోడీ చేతిలో బానిసలా తయారైన ఎన్నికల సంఘం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా తన నిర్ణయాన్ని వెలువరించిందని విమర్శించారు. పార్టీ పేరు, సింబల్ పోయిందని అధైర్యపడొద్దని, త్వరలో జరగనున్న ముంబై మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ సింబల్ ను ఓ దొంగ ఎత్తుకుపోయాడని, ఆ దొంగకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పరోక్షంగా ఏక్ నాథ్ శిండేను ఉద్దేశిస్తూ చెప్పారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నామని, అంతిమంగా తమదే విజయం అంటూ కార్యకర్తల్లో భరోసా నింపేందుకు ఉద్ధవ్ థాక్రే ప్రయత్నించారు.


Next Story

Most Viewed