KCR ను చిక్కుల్లోకి నెడుతున్న TRS ఎమ్మెల్యేలు!

by Disha Web Desk |
KCR ను చిక్కుల్లోకి నెడుతున్న TRS ఎమ్మెల్యేలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్నకొద్ది సీఎం కేసీఆర్‌కు సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పి వ్యవహారాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రభుత్వ గురుకుల ప్రిన్సిపాల్ పై బూతులు తిట్టుకుంటూ గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మహన్ రెడ్డి చిందులు వేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎమ్మెల్యే తీరుపై అధికారులతో పాటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే అయినంత మాత్రాన కాలర్ పట్టుకుని తోసేయడం ఏంటి? ఇది అహంకారానికి నిదర్శనం అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంలో రచ్చ జరుగుతున్నా గత కొంత కాలంగా టీఆర్ఎస్ లోని గల్లీ స్థాయి లీడర్ నుంచి బడా నేతల వరకు ఇదే తంతు కొనసాగుతుండటం సొంత పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేసేలా మారింది. ఎన్నికల సంవత్సరంలోకి వచ్చేశామని స్వయంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవలే వెల్లడించారు. ప్రజాప్రతినిధులు ప్రజలతో మరింత మమేకం అవ్వాలని దిశానిర్దేశం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొదలుకుని స్థానిక ప్రజాప్రతినిధుల తీరు మాత్రం భిన్నంగా ఉంటోంది. లేనిపోని వివాదాలను తలకు రుద్దుకుంటూ పార్టీ ప్రతిష్టను, పరువును గంగపాలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

వివాదాల్లో పోటీ

కొంత మంది టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల తీరుపై సొంత పార్టీ నేతల్లోను విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అధికారులపై ఎమ్మెల్యేల ప్రవర్తన పార్టీని ఇరకాటంలో పెట్టేలా ఉందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తీరు ఇలా ఉంటే ఈ ఏడాది సెప్టెంబర్ లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ పంచాయతీరాజ్ శాఖ అధికారిపై పరుష పదజాం ఉపయోగించి వివాదాస్పదం అయ్యారు. ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే స్థానిక పంచాయతీ కార్యదర్శిని నిలబెట్టి మరి 'ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి కాకుండా మరెవరికి పింఛన్లు ఇచ్చినా... బాగోదు.. నీ లాగు పగులుద్దీ' అంటూ పరుషపదజాలం వాడారు. గతేడాది నవంబర్‌లో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట శాసనసభ్యుడు గువ్వల బాలరాజు ఏకంగా పోలీసుతో వాగ్వాదానికి దిగాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. గవ్వల బాలరాజు తీరుపై పోలీసు శాఖలోని సీనియర్లు నొచ్చుకున్నారు. పోలీసులతో అమర్యాదగా మాట్లాడటం సరికాదని, దాని వల్ల గొప్పతనం పెరిగిపోదంటూ ఓ పోలీస్ అధికారి గువ్వలకు సూచించారు. ఇదే ఏడాది మత్స్యసహాకార అధికారిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తాతా మధు చేసిన రభస కాంట్రవర్సీకి దారి తీసింది. 'అధికారులు అధికారుల లెక్క ఉండండని.. ఉద్యోగం చేయండి.. అంతే కానీ ఎవరికీ ఊడిగం చేయెద్దు' అంటూ హెచ్చరించాడు. ఇంతకీ ఈ గొడవ ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో అని తెలియడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సీఐపై చెలరేగిన తీరు టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శల పాలు చేసింది. ఓ గుడిలో జరిగిన కార్యక్రమంలో మరో వర్గానికి కార్పెట్ పరిచినా అడ్డుకోలేదనే ఇష్యుపై సీఐపై పట్నం మహేందర్ రెడ్డి జుగుప్సాకర వ్యాఖ్యలతో చిందులు వేయడం సంచలనం రేపింది. వీరితో పాటు మరెందరో టీఆర్ఎస్ నేతలు నిత్యం అధికారులతో పాటు సామాన్య ప్రజలపై వ్యవహరిస్తున్న వివాదాస్పద తీరు పార్టీకి ఇబ్బందుల్లోకి నెట్టుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

విపక్షాలకు ఆయుధంగా టీఆర్ఎస్ నేతల వైఖరి

అనేక సందర్భాల్లో అధికార పార్టీ నేతలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అసలే ఎన్నికల ఫీవర్ లోకి రాష్ట్రంలో ఎంట్రీ అయింది. కేసీఆరే స్వయంగా ఎన్నిక మూడ్ లోకి వచ్చామని చెప్పినా నేతల ప్రవర్తనల్లో మార్పు రాకపోవడం హాట్ టాపిక్ గా మారుతోంది. నిన్న గద్వాల్‌లో జరిగిన ఘటపై రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. గత 40 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఈ రెడ్డి దొరల అఘాయిత్యాలు దారుణాలు కొనసాగుతున్నాయని ఆన్ డ్యూటీ అధికారి మీద దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. సొంత పార్టీ నాయకులపై ఉన్న కోపంతో ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అసలే రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య రాజకీయం పీక్స్ లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కారు గుర్తు పార్టీ నేతలు చేస్తున్న వివాదాస్పద చర్యలు పార్టీ గ్రాఫ్ ను మరింత పడిపోయేలా చేస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. కనుసైగతో పార్టీని కంట్రోల్ చేయగలిగే సామర్థ్యం ఉన్న పార్టీ అధినేత కేసీఆర్.. మరి పార్టీలోని నేతలు ఇలా శృతిమించి ప్రవర్తిస్తుంటే కంట్రోల్ చేయడంలో ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి : కాంగ్రెస్‌కు బీజేపీ టెన్షన్.. చక్రం తిప్పిన డీకే అరుణ

Next Story

Most Viewed