తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ అలజడి.. అంతర్గత విషయాలు బయటకు లీక్!

by Disha Web Desk 2 |
తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ అలజడి.. అంతర్గత విషయాలు బయటకు లీక్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కలకలం మొదలైంది. పార్టీలో చర్చిస్తున్న రహస్యాలు బయటకు వెళ్తున్నట్లు టీపీసీసీ గుర్తించింది. ఇంటర్నల్ ఇష్యూస్​ లీక్‌పై కాంగ్రెస్​ఆరా తీస్తున్నది. పార్టీలో ఉన్నోళ్లు చేస్తున్నారా? బయటకు వెళ్లినోళ్లు ప్రచారం చేస్తున్నారా? అనే అంశాలపై ఫోకస్​పెట్టింది. దీంతో పార్టీలో కొత్త అలజడి మొదలైనది. గతంలోనే పార్టీలో కోవర్టులున్నారని సొంత పార్టీ నేతలే వివిధ సందర్భాల్లో ఆరోపణలు చేశారు. థాక్రే ఎంట్రీ తర్వాత పార్టీలో కొంత మార్పు కనిపించినప్పటికీ మళ్లీ అంతర్గత నిర్ణయాలు బయటికి వెళ్తున్నట్లు కాంగ్రెస్​పార్టీలో అనుమానాలు మొదలయ్యాయి. ఇది టీపీసీసీ చీఫ్​కు తలనొప్పిగా మారింది. అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ పార్టీలోనే టీమ్​వర్క్ ​లేకపోవడం రేవంత్​ను విస్మయానికి గురిచేస్తున్నది. దీంతో రేవంత్ ఇక నుంచి ఆచితూచి అడుగులు వేయాలని ప్రణాళికను ఫిక్స్ ​చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఇతరులకు ఈజీ...

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ​వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నది. అందుకు అనుగుణంగా పార్టీ ప్రెసిడెంట్, ఇతర ముఖ్య నాయకులు నిత్యం బీఆర్ఎస్​, బీజేపీ తప్పుడు విధానాలను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు చేస్తున్న నిర్లక్ష్యాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవన్నీ నీరుగార్చే విధంగా సొంత పార్టీలోనే కొందరు నమ్మక ద్రోహం చేస్తున్నట్లు కాంగ్రెస్​పార్టీలో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ ​పార్టీ తీర్మానాలు, అంతర్గత నేతల భేటీ, ఇతర పార్టీ ముఖ్య నాయకుల చేరికల ప్రోత్సాహం, ఢిల్లీ పెద్దలతో మంతనాలు, బీఆర్ఎస్ ​ముఖ్య నాయకులతో సమీక్షలు, ప్రభుత్వ వ్యతిరేకంగా పార్టీ తీసుకోబోతున్న స్టాండ్, పోరాట విధానాలు, ఎజెండాలు వంటివన్నీ ముందే ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు తెలిసిపోతున్నట్లు లేటెస్టుగా టీపీసీసీలో అనుమానాలు మొదలయ్యాయి. వరుసగా జరుగుతున్న పరిణాలతోనే ఇలాంటి డౌట్​లు వస్తున్నాయని టీపీసీసీలోని ఓ కీలక నాయకుడు పేర్కొన్నారు.

అవకాశం ‘చే’ జారకుండా..

గతంతో పోల్చితే రాష్ట్రంలో కాంగ్రెస్​పార్టీ గ్రాఫ్​క్రమంగా పెరుగుతున్నది. బీఆర్ఎస్ ​ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకత, నిరుద్యోగుల్లో సర్కార్ ​సృష్టించిన అలజడి, రైతులకు క్రమంగా జరుగుతున్న నష్టం, రెండు టర్మ్‌లలో ఇచ్చిన హామీలను సర్కార్ ​నెరవేర్చక పోవడం వంటివి కాంగ్రెస్​పార్టీకి ప్లస్ ​అవుతున్నాయి. నిత్యం ప్రజల్లో ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై పోరాటం చేసే వెసులుబాటు కలుగుతున్నది. దీంతో యువత క్రమంగా కాంగ్రెస్ ​వైపు అడుగులు వేస్తోంది. అంతేగాక ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వ్యత్యాసం పెరగడం, సరైన యాక్సిస్ లేకపోవడం వంటికి కాంగ్రెస్​కు కలిసి వచ్చే అంశం. చాలా జిల్లాల్లో గ్రౌండ్​ లెవల్​లో ఇప్పటికే చేరికలు మొదలయ్యాయి. ప్రజల మైండ్‌సెట్​ లోనూ క్రమంగా మార్పు వస్తోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ​ఇంటర్నల్ ​ఇష్యూస్ ​సరిదిద్దుకోకపోతే పార్టీ నష్టపోవాల్సి వస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం వస్తున్న వేవ్‌ను కాంగ్రెస్ ​ఒడిసిపట్టి ముందుకు వెళ్తే విజయం వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

చెక్ పెట్టకపోతే కష్టమే..

ఇతర పార్టీలతో పోల్చితే కాంగ్రెస్​పార్టీలో స్వేచ్ఛ అధికం. దీన్ని అలుసుగా చేసుకొని కొందరు ఒక్కోసారి పార్టీ లైన్​ను క్రాస్ ​చేస్తూ వ్యవహరిస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు పార్టీలో ఎన్నో జరిగాయి. కొందరికి సర్దిచెప్పగా, మరి కొందరికి షోకాజ్​నోటీసులతో సరిపెట్టారు. అయితే అతి త్వరలో సార్వత్రిక ఎన్నికాలు రాబోతున్న నేపథ్యంలో పార్టీలో ఇలాంటివి జరిగితే ఎన్నికల్లో కాంగ్రెస్​ఉనికిని కోల్పోవాల్సి వస్తుందని పొలిటికల్ ఎనాలసిస్టులు చెబుతున్నారు. పార్టీ విషయాలు, ఇంటర్నల్ అంశాలు, చర్చలు ఇతర పార్టీలకు చేరవేస్తున్న వారిని వెంటనే గుర్తించాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.

Also Read..

లెఫ్ట్ పార్టీలతో BRS పొత్తు దాదాపు ఖరారు.. తమ్మినేని, కూనంనేనికి KCR హామీ!



Next Story

Most Viewed