భట్టి విక్రమార్క పాదయాత్రలో ఏపీ టీడీపీ నేత ప్రత్యక్షం!

by Disha Web Desk 2 |
భట్టి విక్రమార్క పాదయాత్రలో ఏపీ టీడీపీ నేత ప్రత్యక్షం!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక ఓ వైపు.. ముందుస్తు ఎన్నికల ప్రచారం మరోవైపు కలగలిసి రాష్ట్ర రాజకీయం హాట్ హాట్‌గా సాగుతోంది. ఈ క్రమంలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోబోతుందనే అంశం సర్వత్రా ఉత్కంఠకు దారి తీస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో ఏపీకి చెందిన సీనియర్ పొలిటీషియన్ సడెన్ ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్య పరిచింది. భట్టి విక్రమార్క ప్రస్తుతం ఆజాదీ కా గౌరవ్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ వైరా నియోజకవర్గ కేంద్రంలో పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో ఆయన పాదయాత్రలోకి ఎపీకి చెందిన దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిగా మారింది.


వివాద రహితుడిగా పేరున్న భట్టి విక్రమార్క రాజకీయంగా మంచి ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. మధిర నుండి ఆయన వరుసగా 3వ సారి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పని చేశారు. ఈ క్రమంలో వివాదాలకు దూరంగా ఉండే భట్టి పాదయత్రలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే చింతమనేని ప్రభాకర్ కనిపించడం చర్చనీయాంశమైంది. చింతమనేని ఏది చేసినా ఓ సంచలనమే. అయితే ఆయనకు కూడా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన వెంట నడిచే క్యాడర్ నిత్యం తోడుగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ ఇద్దరు నేతలు కలవడం ఆసక్తిని రేపుతోంది. వైరా నియోజకవర్గ కేంద్రంలో భట్టి పాదయాత్ర చేస్తుండగా వ్యక్తిగత పనుల నిమిత్తం చింతమనేని ప్రభాకర్ అటుగా వెళ్తున్నారు. భట్టిని చూడగానే తన వాహనాన్ని ఆపిన చింతమనేని.. భట్టి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. ఆయన పాదయాత్రకు సంఘీభావంగా భట్టితో కలిసి కొంత దూరం అడుగులు వేయడం ఆసక్తిని రేపింది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.



Next Story

Most Viewed