నా ప్రసంగం నుంచి కొంత భాగాన్ని తొలగించారు.. రాహుల్ గాంధీ

by Dishafeatures2 |
నా ప్రసంగం నుంచి కొంత భాగాన్ని తొలగించారు.. రాహుల్ గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల తను పార్లమెంట్ లో ఇచ్చిన ప్రసంగంలో నుంచి కొంత భాగాన్ని తొలగించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సోమవారం కేరళలోని వయనాడ్ లో పర్యటించిన రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. లోక్ సభలో తాను ఇచ్చిన ప్రసంగంలో ఎవరిని కూడా కించపరచలేదని, అయినా తన ప్రసంగం నుంచి కొంత భాగాన్ని తొలగించడం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. ఇదే విషయమై లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశానని, అయితే అందుకు సాక్ష్యాలు ఇవ్వాలని తనను కోరినట్లు రాహుల్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తన ప్రసంగంలో నుంచి ఏఏ భాగాలను తొలగించారో సాక్ష్యాలతో సహా లోక్ సభ స్పీకర్ కు లేఖ ద్వారా పంపానని రాహుల్ పేర్కొన్నారు.

తన ప్రసంగంలోని ప్రతి ఒక్క పదం పార్లమెంట్ రికార్డ్ లో ఉండాలనేది తన అభిమతం కాదన్నారు. పార్లమెంట్ లో ప్రధాని మోడీ తనను అవమానించేలా మాట్లాడారని అన్నారు. ''నీ పేరు గాంధీ ఎలా అవుతుంది, నెహ్రూ ఎందుకు కాదు?'' అంటూ మోడీ తనను అవమానించేలా మాట్లాడారని, అయినా మోడీ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించలేదని తెలిపారు. నిజం ఏదో ఒకరోజు బయటపడుతుందని రాహుల్ అన్నారు. పార్లమెంట్ లో మాట్లాడుతున్న క్రమంలో మోడీ చాలా సార్లు నీళ్లు తాగారని, నీళ్లు తాగుతున్నప్పుడల్లా ఆయన చేతులు వణికాయని ఎద్దేవా చేశారు.


తాను చాలా బలవంతుడినని, తనను చూస్తే ప్రజలు భయపడుతారని మోడీ భ్రమ పడుతున్నారని అన్నారు. ఏదో ఒకరోజు మోడీ తన తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పార్లమెంట్ లో జరిగే కార్యక్రమాలను తిలకించి, దేశంలో నెలకొన్న మోడీ.. అదానీ బంధం, దానితో దేశానికి జరుగుతున్న నష్టం గురించి అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత దేశ ప్రజలకు ఉంటుందని రాహుల్ తెలిపారు.



Next Story

Most Viewed