‘INDIA’ కూటమి సంచలన నిర్ణయం.. Narendra Modi స్ట్రాంగ్ రియాక్షన్

by Disha Web Desk 2 |
‘INDIA’ కూటమి సంచలన నిర్ణయం.. Narendra Modi స్ట్రాంగ్ రియాక్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మణిపూర్ హింసాత్మక ఘటనలపై పార్లమెంట్‌లో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న విపక్షాలు మరో కీలక నిర్ణయానికి వచ్చాయి. ప్రధాని సభకు వచ్చి స్వయంగా మణిపూర్ ఇష్యూపై ప్రకటన చేయాలని పట్టుపడుతున్న విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని యోచిస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్దే ఛాంబర్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖర్గే నేతృత్వంలో సమావేశమైన విపక్షాలు మణిపూర్ అంశంపై పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఉన్న అన్ని మార్గాలపై ఈ భేటీలో చర్చించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని 'ఇండియా కూటమి' నిర్ణయించింది. దీనిపై సాధ్యాసాధ్యాలను చర్చించినట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా మణిపూర్ అంశంతో సహా అనేక ఇతర సమస్యలపై సభలో చర్చించే అవకాశం లభిస్తుందనేది విపక్షాల ఆలోచనగా తెలుస్తోంది.

ఉభయసభలు వాయిదా:

మణిపూర్ ఘటనలపై విపక్షాల ఆందోళనతో మంగళవారం కూడా పార్లమెంట్‌లో వాయిదా పర్వం కొనసాగింది. విపక్షాల నిరసనలతో లోక్ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. అంతకు ముందు లోక్ సభలోలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. మిగిలిన సభా కార్యకలాపాలు వాయిదా వేసి మణిపూర్ అంశంపై చర్చించాలని కోరారు. నామా నాగేశ్వర్ రావు వాయిదా తీర్మానం నోటీసు ఇవ్వడం వరుసగా ఇది నాలుగో రోజు. రాజ్యసభలోనూ ఏడుగురు బీఆర్ఎస్ ఎంపీలు మణిపూర్ ఘటనలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. మరోవైపు లోక్ సభలో విపక్షాల ఆందోళనలపై స్పీకర్ ఓం బిర్లా దృష్టి సారించారు. సభ సజావుగా సాగేలా సహకరించాలని కోరుతూ ఇవాళ లోకసభలో అన్ని పక్షాల నేతలతో భేటీ అయ్యారు.

కూటమి పేరులో ఇండియా ఉంటే సరిపోదు: ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. కూటమి పేరులో ఇండియా ఉంటే సరిపోదన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరులో, ఇండియన్ ముజాహిద్దీన్, పీఎఫ్ఐ పేర్లలో కూడా ఇండియా ఉందని గుర్తు చేశారు. మంగళవారం బీజేపీ ఎంపీలతో సమావేశం అయిన ప్రధాని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు విపక్షాలు అంతరాయం కలిగిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇటువంటి దిక్కులేని ప్రతిపక్షాన్ని ఎన్నడూ చూడలేదని ఘాటు విమర్శలు గుప్పించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి దేశం పేరను ఉపయోగించడం సరిపోదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు నిరాశ, నిస్పృహలోనే కొనసాగాలని నిర్ణయించుకుంటున్నాయని ఆ పార్టీల ప్రవర్తనను చూస్తే అర్థం అవుతోందన్నారు. 2024 ఎన్నికల్లోనూ ప్రజల మద్దతు బీజేపీకే ఉందని తమ ప్రభుత్వ హయాంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed