దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రధాని మోడీకి ప్రతిపక్షాల లేఖ

by Dishafeatures2 |
దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రధాని మోడీకి ప్రతిపక్షాల లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాని మోడీకి ప్రతిపక్షాలు లేఖ రాశాయి. మోడీకి రాసిన ఈ లేఖలో బీఆర్ఎస్, ఆప్, టీఎంసీ, డీఎంకే, జేడీయూ, జేడీఎఎస్, ఎన్సీపీ, ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, శివసేన (ఉద్ధవ్ థాక్రే), ఆర్జేడీ వంటి ప్రతిపక్ష పార్టీల అధినేతలు సంతకం చేశారు. భారత్ ఇంకా ప్రజా స్వామ్య దేశమనే తాము ఇంకా నమ్ముతున్నామని, కానీ సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని చూస్తుంటే ప్రజాస్వామ్యం స్థానంలోకి నియంతృత్వం వచ్చి చేరిందనే అనుమానం కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు. ప్రతి పక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలులో వేసి వేధిస్తున్నారని ఆరోపించారు. తాజాగా ఆప్ నేత మనీశ్ సిసోడియా ఉదంతం అలాంటిదేనని చెప్పుకొచ్చారు.

మోడీ అధికారంలోకి వచ్చాక కీలకమైన రాజకీయ నాయకులను అరెస్ట్ చేయడం, లేదా వాళ్ల ఇళ్లల్లో దాడులు చేయడం, లేదా గంటల కొద్దీ విచారణ చేయడం వంటివి ఎక్కువయ్యాయని లేఖలో తెలిపారు. అయితే ఇందులో చాలా మంది ప్రతిపక్ష పార్టీల నాయకులే ఉన్నారని, మోడీ రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారనే దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. నయానో భయానో బెదిరించి ప్రతి పక్ష నాయకులను తమ పార్టీలో చేర్పించుకుంటున్నారని, అలా చేరినవాళ్ల కేసుల విషయంలో దర్యాప్తు సంస్థలు పెద్దగా పట్టించుకోవు అని చెప్పారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను వేధించడం మానుకోవాలని హితవు పలికారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానకి దూరంగా ఉంది.

Next Story

Most Viewed