Nara Brahmani: మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి..

by Disha Web Desk 3 |
Nara Brahmani: మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి..
X

దిశ ప్రతినిధి. గుంటూరు: నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ బేతపూడి మల్లెతోటల్లో పనిచేస్తున్న మహిళా కూలీలను నారా బ్రాహ్మణి కలిశారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమర్థుడైన పాలకుడు ఉంటేనే ప్రజలకు సుపరిపాలన అందుతుంది, గత అయిదేళ్లుగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్న వారు మూడుముక్కలాటతో ప్రజల బతుకులను ఛిద్రం చేశారని ఆమె పేర్కొన్నారు.

ఒకప్పుడు రాళ్లురప్పలతో నిండిన హైదరాబాద్‌ను హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా విశ్వనగరంగా మార్చిన దార్శనికుడు చంద్రబాబు నాయుడని కొనియాడారు. ఎల్లప్పుడూ ప్రజాక్షేమాన్ని కాంక్షించే చంద్రబాబుపై తప్పుడు కేసులుపెట్టి 53రోజులపాటు అక్రమంగా జైలులో నిర్భందించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కక్షపూరిత రాజకీయాలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

అలానే రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరగిపోయాయని.. భద్రతలేక భయంతో మహిళలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని మండిపడ్డారు. నాసిరకం మద్యం కారణంగా నిరుపేద కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి క్యాపిటల్‌గా మార్చేశారని వైసీపీపై బ్రాహ్మణి నిప్పులు చెరిగారు.

చంద్రబాబు సీఎం అయ్యాక మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతారని స్పష్టం చేశారు. భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటిపన్నులు, కరెంటుబిల్లులతో ప్రజలపై భారంమోపారని ఆమె పేర్కొన్నారు. అమరావతి విధ్వంసంతో ఇక్కడి ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పేద, మధ్య తరగతి ప్రజల ఆదాయాలు పడిపోయాయని.. రాబోయే ఎన్నికల్లో అందరి ఆశీస్సులతో చంద్రబాబు సీఎం అయ్యాక రాజధాని నిర్మాణం చేపట్టి అమరావతి ప్రాంతానికి గతవైభవం తెస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు రప్పించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు. రాష్ట్రప్రజలు రెండునెలలు ఓపికపడితే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అన్నివర్గాల ప్రజల కష్టాలు తీరుతాయని తెలిపారు.

ఇక ఇబ్బందుల్లో ఉన్న చేనేతలను ఆదుకునేందుకు నారా లోకేష్ టాటా తనేరియాతో ఒప్పందం చేసుకుని వీవర్స్ శాలను ఏర్పాటుచేశారని తెలిపారు. అధునాతన మగ్గాలు, డిజైన్లతోపాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి చేనేతల ఆదాయం పెంచేందుకు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. నారా లోకేష్ చేస్తున్న మంచి పనుల్లో ఇదో చిన్న కార్యక్రమం మాత్రమేనని.. లోకేష్ విజన్ అమలైతే మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం దేశంలోనే నెం.1గా తయారవుతుందని నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు.



Next Story

Most Viewed