అమిత్ షా సభకు పవన్‌‌ను ఆహ్వానించడం లేదు.. బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్

by Dishafeatures2 |
అమిత్ షా సభకు పవన్‌‌ను ఆహ్వానించడం లేదు.. బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్‌లో ఈ నెల 11న కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో నిర్వహించబోతున్న బహిరంగ సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించడం లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్ అన్నారు. ఇది పూర్తిగా పార్టీ పరమైన కార్యక్రమం కావడంతో పవన్‌ను ఆహ్వానించడం లేదని స్పష్టం చేశారు. 9 ఏళ్ల మోడీ పాలనలో బీజేపీ సాధించిన విజయాలను ఆ సభలో అమిత్ షా వివరిస్తారని వెల్లడించారు. ఇది పూర్తిగా భారతీయ జనతాపార్టీ సభ మాత్రమేనని అందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించడం లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. విశాఖలో శుక్రవారం సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 10న తిరుపతిలో బీజేపీ బహిరంగ సభ యధావిధిగా జరుగుతుందని వెల్లడించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరవుతారని స్పష్టం చేశారు.

పొత్తులపై అప్పుడే నిర్ణయం

ఢిల్లీ కేంద్రంగా హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ భేటీపై పూర్తిస్థాయి సమాచారం తమకు తెలియదన్నారు. ఈ భేటీలో ఏం జరిగింది.. ఎందుకు జరిగింది అనే దానిపై అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లేదా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులే క్లారిటీ ఇవ్వాలని అన్నారు. పొత్తులపై పార్టీ జాతీయ నాయకత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.అయితే 2024 ఎన్నికల్లో ఏపీలో ఖచ్చితంగా బీజేపీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వమే వస్తుందని సీఎం రమేశ్ జోస్యం చెప్పారు.

Next Story

Most Viewed