ఏపీలో విపక్షాలకు చుక్కలు చూపిస్తోన్న బోల్డ్ బ్యూటీ!

by Disha Web Desk |
ఏపీలో విపక్షాలకు చుక్కలు చూపిస్తోన్న బోల్డ్ బ్యూటీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేదు. ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే డిసెంబర్‌లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తే ఎన్నికలకు సమయం లేదు అనేది సత్యం. అందుకే ఇప్పటికే వైసీపీ ఎన్నికల ప్రచారం సైతం నిర్వహించేస్తోంది. ఇక ఎన్నికల ప్రచారం అంటే సినీ గ్లామర్‌ కూడా అత్యంత కీలకం. గత ఎన్నికల్లో వైసీపీకి సినీనటులు భారీగానే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారిలో చాలా మంది నటులు వైసీపీకి దూరం అయ్యారు. కొంతమంది సినీనటులు బీజేపీలో చేరితో మరికొంతమంది జనసేనలో చేరిపోయారు. ఇంకొందరు అయితే దాదాపు సైలెంట్ అయిపోయారు.

ప్రస్తుతం వైసీపీలో పోసాని కృష్ణమురళి, అలీలు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. మిగిలిన నటులు అంతగా కనిపించడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఎవరు ఎలక్షన్ కాంపైన్‌లో పార్టిసిపేట్ చేస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి తరుణంలో గ్లామర్ నటి రమ్యశ్రీ మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. 2019 ఎన్నికలకు ముందు సినీనటి రమ్యశ్రీ వైసీపీలో చేరారు. అనంతరం విశాఖలోని పలువురు వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి గెలుపులో కీలకభాగస్వామిగా మారారు. అనంతరం ఆమె వైసీపీలో పదవి ఆశించి భంగపడ్డారు. అప్పటి నుంచి సైలెంట్ అయిపోయిన రమ్యశ్రీ ఇప్పుడు దూకుడు పెంచారు. టీవీ డిబేట్లలో తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. దీంతో రమ్యశ్రీ స్టార్ కాంపైనర్‌గా ఉంటారా? లేక వైసీపీ తరఫున పోటీ చేస్తారా అన్న చర్చ జరుగుతుంది.

సినీనటిగానే కాదు సామాజిక సేవకురాలిగా..

సినీ నటి రమ్యశ్రీ అంటే తెలియని వారుండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యంగా విశాఖ ప్రజలకు అత్యంత సుపరిచితం. అనేక సినిమాల్లో వ్యాంప్ తరహా పాత్రల్లో నటించి ఏకంగా ఒక సినిమా కోసం టాప్ లెస్ గా కూడా నటించి అందర్నీ మెప్పించారు. టాలీవుడ్‌తో ప్రారంభమైన ఈమె సినీ కెరీర్ కన్నడ, తమిళ, మళయాల, హిందీ, భోజ్ పురి భాషలలో 400 చిత్రాలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. అటు కన్నడలో హీరోయిన్‌గా 36 సినిమాల్లో నటించారు. రమ్యశ్రీ నటించిన ఆర్యభట్ట అనే కన్నడ చిత్రానికి కర్ణాటక రాష్ట్రప్రభుత్వ పురస్కారం కూడా లభించిన సంగతి తెలిసిందే. ఎక్కువగా శృంగార రస పాత్రలను పోషిస్తూ యువత కంటిమీద కునుకలేకుండా చేశారు. నటించడమే కాదు డైరెక్ట్ చెయ్యడమూ ఆమెకు వెన్నతోపెట్టిన విద్య. తాను పెరిగిన వాతావరణాన్ని పరిగణలోకి తీసుకుని ఒక గిరిజన యువతి సమస్యలను ప్రపంచానికి చాటిచెప్తూ మల్లి అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ పలు అవార్డులను సొంతం చేసుకుంది.

సినీ నటిగానే కాదు సామాజిక సేవకురాలిగా కూడా రమ్యశ్రీకి మంచి పేరుంది. రమ్య హృదయాలయ ఫౌండేషన్ ద్వారా ఎందరో పేదలకు ఆపన్నహస్తం అందించింది. ఆమె సేవలను గుర్తించిన కాలిఫోర్నియాలోని నేషనల్ డీమ్డ్ యూనివర్శిటీ ఆమెను గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసి సత్కరించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత నేషనల్ డీమ్డ్ యూనివర్శిటీ నుంచి అవార్డు అందుకున్న రెండో వ్యక్తిగా రమ్యశ్రీ చరిత్ర సృష్టించారు. అంతేకాదు జాతీయ మదర్ థెరిస్సా అనే అవార్డును సైతం రమ్యశ్రీ సొంతం చేసుకున్నారు. అంతేకాదు బీసీ సామాజిక వర్గం కోసం అలుపెరగని పోరాటం చేశారు. దీంతో ఆమె విశాఖపట్నం జిల్లాతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఆమెకంటూ ఓ గుర్తింపు ఉంది.

సోదరులను సైతం కాదని..

మల్లి సినిమా అనంతరం రమ్యశ్రీ సినిమాల్లో నటించడం దాదాపు మానేశారు. అడపాదడపా నటిస్తూ.. బీసీ సామాజిక వర్గం బలోపేతంపై పోరాటం చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికలకు ముందు ఆమె వైసీపీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రమ్యశ్రీ సోదరులు ఒకరు టీడీపీ తరఫున, మరొకరు జనసేన తరఫున ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ రమ్యశ్రీ వారిని పట్టించుకోలేదు. సోదరులను సైతం పక్కనపెట్టి వైసీపీ అప్పగించిన బాధ్యతల ప్రకారం చెట్టి ఫాల్గుణ గెలుపుకోసం కృషి చేశారు. అరకు నియోజకవర్గాన్ని జల్లెడపట్టారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వైసీపీ గెలుపులో కీలకభూమిక పోషించారు రమ్యశ్రీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెకు నామినేటెడ్ పదవి వరిస్తుందని అంతా భావించారు కానీ ఆమెకు ఎలాంటి పదవులు రాలేదు. దీంతో ఆమె సైలెంట్ అయిపోయారు.

ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా?

సినీ ఇండస్ట్రీలో చాలా యాక్టివ్‌గా ఉండే రమ్యశ్రీ ఇక రాజకీయాల్లోనూ వైసీపీ నేతగా అంతే దూకుడు ప్రదర్శించారు. అటు ఎన్నికల ప్రచారంలో విపక్షాలకు చుక్కలు చూపించారు. ఇటు ఇంటర్వ్యూలతో ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నా అన్నవారిని సైతం పక్కన పెట్టిన రమ్యశ్రీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి గుర్తింపు ఇస్తుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ అవేమీ జరగలేదు. అప్పట్లో ఇంటర్వ్యూలలో ఇక తనకు టూరిజం శాఖ మీద ఆసక్తి ఎక్కువ అని ఆమె తెలిపారు. పోనీ ఆశాఖకు సంబంధించి ఏదైనా నామినేటెడ్ పోస్టు అయినా దక్కుతుందని అంతా భావించారు. అది కూడా ఇవ్వలేదు. దీంతో ఆమె సైలెంట్ అయ్యారు.

అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రమ్యశ్రీ మళ్లీ తెరపైకి వచ్చారు. టీవీ డిబేట్లలో వైసీపీ తరుఫున దుమ్ముదులిపేస్తున్నారు. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడులపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. దీంతో రమ్యశ్రీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేక కేవలం స్టార్ కాంపైనర్‌గానే ఉంటారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. చెట్టి ఫాల్గుణకు సర్వేలో సానుకూలంగా లేకపోవడంతో రమ్యశ్రీ పోటీ చేస్తారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి: YCP: మాజీ మంత్రికి ఈ సారి టికెట్ డౌటేనా?


Next Story

Most Viewed