బాబు సంకనెక్కితే బలిపశువయ్యేది పవనే.. మంత్రి అంబటి

by Dishafeatures2 |
బాబు సంకనెక్కితే బలిపశువయ్యేది పవనే.. మంత్రి అంబటి
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలనే తాపత్రాయంతోనే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని విమర్శించారు. చంద్రబాబు సంకనెక్కితే పవన్ కల్యాణ్ బలిపశువు అవ్వక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు లాంటి నమ్మక ద్రోహులను నమ్ముతారా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం గణపవరంలో మంగళవారం సచివాలయ కన్వీనర్లు, గృహసారధుల శిక్షణ తరగతులకు అంబటి రాంబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి అంబటి రాంబాబు కీలక ప్రసంగం చేశారు. వచ్చే ఎన్నికల్లో తోడేళ్లు అన్నీ ఏకమైనా అంతిమ విజయం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష రాష్ట్ర ప్రజల్లో బలంగా ఉందని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో నేతల సందడిపై సెటైర్లు వేశారు. సత్తెనపల్లి నాదంటే నాది అంటూ చాలా మంది తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ మధ్య కొత్తగా కూడా ఒకాయన వస్తున్నారని ఎంతమంది వచ్చినా తమకు ఎలాంటి భయం లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఇలాంటి దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళేలా గృహ సారధులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సమన్వయంతో పనిచేయాలని మంత్రి అంబటి రాంబాబు సూచించారు.



Next Story

Most Viewed