రాష్ట్రంలో ఈయనే రిచ్ పొలిటిషియన్.. మొత్తం ఎంత ఆస్తి ఉందంటే?

by Disha Web Desk 2 |
రాష్ట్రంలో ఈయనే రిచ్ పొలిటిషియన్.. మొత్తం ఎంత ఆస్తి ఉందంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: డబ్బు సంపాదించడానికి చదువుతో సంబంధం లేదని తాజాగా ఓ మంత్రి నిరూపించారు. ఆయన చదివింది తొమ్మిదైతే.. సంపాదించిన ఆస్తి రూ.1,609 కోట్లు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. మే 10వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీల నేతలు నామినేషన్ దాఖలు చేసే పనిలో ఉన్నారు. హొసకోటె నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి ఎంటీబీ నాగరాజు తన ఆస్తులను ప్రకటించారు. సోమవారం నామినేషన్ దాఖలు చేసిన ఆయన తన అఫిడవిట్‌లో కళ్లు చెదిరే ఆస్తులను పేర్కొన్నారు.

నాగరాజు తనకు రూ. 1,609 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలిపారు. గత మూడేళ్లలో ఆయన ఆస్తులు రూ.400 కోట్లు పెరిగాయి. రాష్ట్రంలోనే నెంబర్-1 ధనిక రాజకీయ నాయకుడుగా నాగరాజ్ ఉన్నారు. 2019 ఉప ఎన్నికల కోసం దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయన ఆస్తుల విలువ రూ.1,200 కోట్లుగా చూపించారు. మంత్రి ఆస్తిలో తన భార్య పేరిట రూ.536 కోట్ల చరాస్తులు, రూ.1,073 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు తెలిపారు. అలాగే, ఇద్దరికీ కలిపి రూ.98.36 కోట్ల రుణాలున్నట్టు పేర్కొన్నారు. ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంపాదించినట్లు తెలుస్తోంది. మంత్రి ఆస్తుల విలువ చూసి అంత షాక్ అవుతున్నారు. వ్యవసాయం, వ్యాపారం ప్రధాన వృత్తిగా పేర్కొన్న నాగరాజ్.. తొమ్మిదో తరగతి వరకే చదువుకోవడం గమనార్హం.



Next Story