కేసీఆర్ ను గద్దె దించే వరకు కమలదళం శ్రమించాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by Disha Web Desk 11 |
కేసీఆర్ ను గద్దె దించే వరకు కమలదళం శ్రమించాలి:  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, కంటోన్మెంట్/ బోయిన్ పల్లి: తెలంగాణ సర్కారు గద్దె దించేందుకు కమలదళం శ్రమించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని స్పష్టం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోని బీజేపీ శ్రేణులు ఎక్కువ కష్టపడాల్సి ఉందన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ సర్కారును గద్దె దింపే వరకు ఇప్పటి నుంచే కష్టపడాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ బలంరాయిలో క్లాసిక్ గార్డెన్ లో గురువారం జరిగిన బీజేపీ సికింద్రాబాద్, మహంకాళి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లాల కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చినా.. ముఖ్యమంత్రి అభ్యర్థితో సహా, మంత్రి మండలి కూర్పులో ఆ పార్టీ లో విభేదాలు బయట పడ్డాయని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి కాంగ్రెస్ తో సహా ఇతర ప్రతిపక్షాలు నరేంద్ర మోడి ప్రభుత్వానికి ఏ విధంగా ప్రత్య్నాయమ్నాయమవుతాయని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడికి ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు గ్రాఫ్ పెరుగుతుందని గుర్తు చేశారు. మోడి సర్కారులో ఎటువంటి తప్పులు లేకపోవడంతో మోడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయా రాజకీయ పార్టీలు విష ప్రచారానికి దిగాయని విమర్శించారు. మోడి ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని అన్నారు.

ఒకప్పుడు కశ్మీర్ లో త్రివర్ణ పతాకం ఎగురవేయాలంటే భద్రతా దళాల అవసరం ఉండేదని, మోడి ప్రభుత్వంలో ప్రపంచ దేశాల ప్రధానులతో సదస్సు నిర్వహించే స్థితి సాధించగలిగామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది కుంటు పడిందన్నారు. అవినీతి పెరిగిపోయి కేసీఆర్ సర్కారు తీరు పట్ల అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారని అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలతో సతమవుతున్న ప్రజలను కలిసే సమయం లేని కేసీఆర్.. ఇతర రాష్ట్రాలలో తిరుగుతూ తన అవినితీ సొమ్మును పంచుతూ బీఆర్ఎస్ పార్టీనీ ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ నెల 30 వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి మోడి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించాలని బీజేపీ శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

బీజేపీ ఓబీసీ సెల్ విభాగం జాతీయ అధ్యక్షుడు, రాజ్య సభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్, ఇతర పార్టీలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1975లో పార్లమెంట్ లో అపెక్స్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ, 1985లో పార్లమెంట్ లో లైబ్రరీ ప్రారంభోత్సవం సందర్భంగా రాజీవ్ గాంధీలు అప్పటి అధ్యక్షులను ఆహ్వానించలేదన్నారు. చత్తీస్ ఘడ్ శాసన సభకు శంకుస్థాపనకు సోనియా గాంధీ ఏ హోదాలో శంకుస్థాపన చేశారో కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో గవర్నర్ గా ఉన్న ఆదివాసీ అనసూయను ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడి తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలకు అడ్డుపడుతూ, వక్ర భాష్యంతో దుష్పరచారం చేస్తుండడాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలన్నీ మోడికి బ్రహ్మరథం పట్టడాన్ని కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు.

యూపీఏ హయాంలో రాజ్యంగ పదవిలో లేకపోయినా సోనియా గాంధీ విదేశీ ప్రతినిధులతో ఎలా సమావేశాలు నిర్వహించారో కాంగ్రెస్ మిత్రపక్షాలు ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. రాష్ట్రపతిని రబ్బర్ స్టాంప్ గా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. విదేశీ, బ్రిటీష్ వాసనలను, బ్రిటీష్ భావజాలాన్ని కాంగ్రెస్ పార్టీ వీడడంలేదని లక్ష్మణ్ ద్వజమెత్తారు. సమావేశంలో బీజేపీ సీనియర్ నేతలు చింతల రాంచంద్రారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బండా కార్తీక రెడ్డి, బంగారు శృతి, ఎన్. రాంచందర్ రావు, బూరుగు శ్యాంసుందర్ గౌడ్, మేకల సారంగపాణి, గౌతంరావ్, సుబాష్, టి.రాజశేఖర్ రెడ్డి, జి.మధుసూదన్, గీతా మూర్తి, జె.రామక్రిష్ణ, బి.ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ తీర్థం పుచ్చుకున్న పరశురామ్..

గురువారం సాయంత్రం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మఢ్ పోర్టు మైదానంలో నిర్వహించిన సభలో కంటోన్మెంట్ బోర్డులో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన అధికారి పరశురామ్ బీజేపీలో చేరారు. పరశురామ్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్య సభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ లు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి బీజేపీలో చేరిన పరశురామ్ కు పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఎండ గట్టడాలని కోరారు. పరశురామ్ మాట్లాడుతూ.. నరేంద్ర మోడి చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు తనను ఎంతగానో ఆకర్షించాయని అన్నారు.

Next Story

Most Viewed