AP Politics: కన్న తల్లి మనసు గెలవలేని జగన్.. రాష్ట్ర ప్రజల మన్ననలు పొందగలడా..?

by Indraja |

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఒక్కరోజే ఉంది.

AP Politics: కన్న తల్లి మనసు గెలవలేని జగన్.. రాష్ట్ర ప్రజల మన్ననలు పొందగలడా..?
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఒక్కరోజే ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ గెలుపే ధ్యేయంగా అడుగులేస్తోంది. ప్రతిపక్షాలు రానున్న ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. వైసీపీ అధికారం చేజారకుండా జాగ్రత్తపడుతోంది. అయితే ప్రతి పార్టీకి కుటుంబ సభ్యుల అండదండలు ఉన్నాయి.

కానీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం సొంత కుటుంబ సభ్యులే శత్రువులుగా మారారు. గత ఎన్నికల్లో అన్న కోసం పోరాడిన వైఎస్ షర్మిల ఇప్పుడు అన్న పైనే పోరాటం చేస్తోంది. అన్నా చెల్లిల్ల మధ్యనే విభేదాలు అనుకున్న తరుణంలో తల్లి విజయమ్మకు కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చలేదు అని తేలిపోయింది.

ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కన్న తల్లిని, సొంత చెల్లిని గాలికి వదిలేసిన సీఎం జగన్‌ను గెలిపిస్తే రాష్ట్రాన్ని గంగలో ముంచుతాడని, తల్లి, చెల్లి మీద లేని ప్రేమ రాష్ట్ర ప్రజలపైన ఎలా ఉంటుదని ప్రజలు సీఎం జగన్‌‌పై మండిపడుతున్నారు. కన్న తల్లి మనసు గెలవలేని జగన్, రాష్ట్ర ప్రజల మన్ననలు పొందగలడా..? ఎన్నికల్లో నెగ్గగలడా అనే అనుమానాలు సొంత పార్లీ నేతల్లోనే కలుగుతున్నాయని సమాచారం.

వైఎస్ విజయమ్మ ఆంతర్యం ఇదేనా..?

కొడుకు, కూతురు ఇద్దరూ ఎన్నికల బరిలో తలపడుతున్న నేపథ్యంలో, విడవమంటే పాముకి కోపం, కరవమంటే కప్పకు కోపం, ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్న విజయమ్మ అటు కూతురుకి ఇటు కొడుకుకి సర్ది చెప్పలేక ఇటీవల అమెరికాకు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కూతురు వైఎస్ షర్మిలను గెలిపించాలని విజయమ్మ మాట్లాడిన ఓ వీడియోను వైఎస్ షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

కాగా తన భర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రజలు ఆదరించారని, అలానే రాజశేఖర్ రెడ్డి కూడా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని వీడియోలో వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. అప్పుడు ఎలాగైతే రాజశేఖర్ రెడ్డిని ఆదరించి ఒక అవకాశం ఇచ్చారో, ఇప్పుడు ఆయనలానే ప్రజలకు మంచి చేయడానికి ఎంపీ అభ్యర్థిగా కడప నుండి పోటీ చేస్తున్న రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలను సైతం అలానే ప్రజలు ఆదరించి గెలిపించాలని ఆ వీడియోలో వైఎస్ విజయమ్మ కోరారు.

కాగా విజయమ్మ మాట్లాడిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఎన్నికల సమయంలో కొడుకు కూతురు ఇద్దరు ఎన్నికల బరిలో ఉన్నప్పుడు వైఎస్ విజయమ్మ కూతురికి మాత్రమే మద్దతు ఇవ్వడం ప్రస్తుతం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది. వైఎస్ షర్మిలకు విజయమ్మ మద్దతిస్తూ తన కూతురుని గెలిపించాలని కోరారు అంటే పరోక్షంగా జగన్‌ను ఓడించమని చెప్పినట్టే అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story