- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటింటికీ యోగా.. 365 రోజుల కార్యాచరణకు శ్రీకారం
రాష్ట్రంలో యోగాను ప్రజల జీవనశైలిలో భాగం చేసేందుకు ప్రభుత్వం 'ఇంటింటికీ యోగా' పేరుతో 365 రోజుల కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు విజయవాడలో బుధవారం జరిగిన సమావేశంలో దీనిపై ప్రాథమిక కార్యాచరణ రూపొందించారు...

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో యోగాను ప్రజల జీవనశైలిలో భాగం చేసేందుకు ప్రభుత్వం 'ఇంటింటికీ యోగా' పేరుతో 365 రోజుల కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు విజయవాడలో బుధవారం జరిగిన సమావేశంలో దీనిపై ప్రాథమిక కార్యాచరణ రూపొందించారు. ప్రణాళిక ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాలను 'యోగా మందిరాలు'గా మార్చి ప్రజలకు 15 రోజుల ప్రాథమిక శిక్షణ ఇచ్చి, అనంతరం మూడు నెలల పాటు ఇంటి వద్ద యోగా సాధన చేసేలా ప్రోత్సహించనున్నారు. సంజీవని ఆరోగ్య పరీక్షలతో యోగాను అనుసంధానించి, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాధులవారీగా ప్రత్యేక యోగా సాధనలను అందించనున్నారు.
స్కూళ్ళలో రెండు రోజులు యోగా
అలాగే పాఠశాలల్లో వారానికి రెండు రోజులు యోగా తరగతులు నిర్వహించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. వ్యాయామ ఉపాధ్యాయులకు యోగా శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఉన్న 'యోగాంధ్ర' పోర్టల్ను ఆధునికీకరించి, ప్రజలకు యోగా శిక్షకులు, శిక్షణ కేంద్రాలు, వ్యాధులవారీ యోగా వీడియోలు, సాధన మార్గదర్శకాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. కార్యక్రమం అమలుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారం కూడా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.






