బీజేపీలోకి టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్?

by Disha Web Desk 2 |
బీజేపీలోకి టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కలిశారు. మంగళవారం ఆమె ఢిల్లీలో ఆయనతో భేటీ అయ్యారు. ఇప్పుడు ఈ భేటీ రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్ది కాలంగా బీజేపీ అగ్రనేతలు వరుసగా సినీ నటులు, క్రీడా, పలు రంగాలకు చెందిన పలువురితో వరుసగా భేటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రామోజీరావు, జూనియర్ ఎన్టీఆర్, నితిన్, ప్రభాస్‌ను కలిశారు. ఇటీవల హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సైతం మిథాలీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ తరుపున ప్రచారానికి సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ శ్రేణులు స్పష్టంచేశాయి. తాజాగా అమిత్ షాతో భేటీ అవ్వడం పార్టీలో చేరడానికే.. అనే అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఆమె కాషాయతీర్థం పుచ్చుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ విమోచన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల్ల గోపీచంద్‌తో కూడా భేటీ అయ్యారు. కానీ ఆయన కేవలం క్రీడా రంగానికి చెందిన అంశాలపై మాత్రమే చర్చలు జరిపినట్లు తెలిపారు. అయితే ఈ భేటీ వెనుక కూడా రాజకీయ కోణం ఉందనే అనుమానం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

మిథాలిపై.., షా.. ప్రశంసలు

మిథాలి రాజ్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఈ భేటీ అనంతరం షా వారిరువురూ భేటీ అయిన ఫొటోలోనే షేర్ చేయడమే కాకుండా అత్యుత్తమ మహిళా బ్యాటర్ అంటూ అభివర్ణించారు. భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో సంభాషణ చాలా ఉల్లాసంగా సాగిందన్నారు.రెండు దశాబ్దాల ఆమె కెరీర్‌లో ఎన్నో సందర్భాల్లో దేశానికి విజయాలను అందించిందని, భవిష్యత్ క్రీడాకారిణులకు ఆమె స్ఫూర్తిగా నిలవనుందని ట్వీట్‌లో కొనియాడారు.

Next Story