కాంగ్రెస్కూ మద్దతిస్తాం.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

by Dishafeatures2 |
కాంగ్రెస్కూ మద్దతిస్తాం.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే రోజుల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే ఏ పార్టీకైనా మద్దతిచ్చే అవకాశం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. బుధవారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే తప్పకుండా సీపీఎం పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించారు. గతంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామని, తెలంగాణలో కూడా భవిష్యత్తులో ఇచ్చే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీజేపీపై గట్టి పోరాటం చేస్తున్నది కేసీఆర్ మాత్రమేనని , అందుకే టీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్నాట్లు పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలోని ప్రభుత్వ హామీలు, సమస్యలు పరిష్కారాలపై సీపీఎం ప్రశ్నిస్తూనే ఉంటుందన్నారు.

పేదలకు రావాల్సిన ఇళ్లపై పోరాటం కొనసాగిస్తామన్నారు. చట్టబద్ధంగా ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నం చేస్తామన్నారు. జూన్ నెలలో ధరణి, నిరుద్యోగ , రైతు వ్యతిరేక నిర్ణయాలు, కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు , అంగన్వాడీ ఆశాల సమస్యలు, రెగ్యులరైజేషన్ అంశాలపై భారీ ఎత్తున పోరాటం ఉంటుందన్నారు. అన్ని ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు ఆందోళనలు కొనసాగుతాయన్నారు. అవసరమైతే అసెంబ్లీ, ప్రగతి భవన్ ముట్టడించడానికి వెనకాడమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పొలిటి బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

Next Story