అంబానీ, అదానీలకు మోకరిల్లుతున్న ప్రధాని మోడీ.. బీవీ రాఘవులు

by Dishafeatures2 |
అంబానీ, అదానీలకు మోకరిల్లుతున్న ప్రధాని మోడీ.. బీవీ రాఘవులు
X

దిశ, కదిరి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని బడా వ్యాపారవేత్తలైన అంబానీ, అదానీలకు మోకరిల్లితోందని సీపీఎం కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. నరేంద్ర మోడీ బడా బాబులకు బాసటగా నిలిచారని ఆయన ఆరోపించారు. మంగళవారం శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణానికి కోర్టుకు హాజరయ్యే నిమిత్తం వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. తొమ్మిదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య, పేద, బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమాన్ని విస్మరించి.. కేవలం బడా బాబుల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మెజార్టీ మోసగాళ్లు అంతా కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హమన్నారు.

ఇలాంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ఆగడాలను ఎండగట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్.. అదేవిధంగా ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు గానీ ఏమాత్రం శ్రద్ధ చూపకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని వైకాపా బీజేపీకి వత్తాసు పలుకడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలోని అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పి ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయడం వల్ల లక్షల మంది ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అవుతోందన్నారు. బడ్జెట్ విషయంలో కూడా ఆర్థిక ప్రయోజనాలు పూర్తిగా విస్మరించారని, వచ్చే ఎన్నికలలోనైనా ప్రతిపక్షాలు ఐక్యతతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.


Next Story

Most Viewed