మోడీకి చెక్‌ పెట్టేలా భారీ వ్యూహం.. కాంగ్రెస్‌కు ఓకే చెప్పిన ఆ రాష్ట్ర సీఎం!

by Disha Web Desk 2 |
మోడీకి చెక్‌ పెట్టేలా భారీ వ్యూహం.. కాంగ్రెస్‌కు ఓకే చెప్పిన ఆ రాష్ట్ర సీఎం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు ప్రతిపక్ష పార్టీలను సంఘటితం చేసే పనిలో కాంగ్రెస్ మరో కీలక ముందడుగు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు భావసారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలతో త్వరలో ఓ సమావేశం నిర్వహించబోతోంది. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే శుక్రవారం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు ఫోన్ చేసి ప్రతిపాదిత సమావేశంలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలిసింది. ఇందుకు స్టాలిన్ సైతం ఓకే చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు ఓవైపు, మమతాబెనర్జీ, కేజ్రీవాల్, కేసీఆర్ వంటి నేతల కూటమి ప్రయత్నాలు మరోవైపు కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితులుగా మారుతున్న నేపథ్యంలో వచ్చే ఎడాదిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని హస్తం నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఈ మేరకు ఇతర ప్రతిపక్ష పార్టీలతో ఓ మీటింగ్ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ మరియు వామపక్ష పార్టీల వంటి ఇతర ప్రతిపక్ష పార్టీలతో ఇప్పటికే సంప్రదింపులు జరపగా వారి ప్రతిస్పందన కోసం కాంగ్రెస్ వేచి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీల నుంచి స్పందన వచ్చాక కాంగ్రెస్ నిర్వహించబోయే సమావేశం వేదిక, తేదీ ఖరారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో విపక్షాల తీరుపై స్పష్టత కొరవడింది. కొన్ని పార్టీలు కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు సిద్ధం అయితే మరికొన్ని పార్టీలు ససేమిరా అంటున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఐక్యతతో పాటు ప్రతిపక్ష పార్టీల విస్తృత కూటమిని ఏర్పాటుకు ప్రయత్నాలు జరగకపోతే అది బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు కలిసి వచ్చే పార్టీలతో ఓ మీటింగ్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే 2019లో జరిగిన ఎన్నికల్లో 14 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు జాతీయ ఓట్లలో 39 శాతం సాధించాయి. 542 సభ్యుల పార్లమెంటులో 160 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీకి మాత్రమే 38 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో కలిసి పని చేస్తే గెలుపు తమ వైపు తిప్పుకోవచ్చనేది కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది. మరి కాంగ్రెస్ చేస్తున్న ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి మరి.


Next Story