కాంగ్రెస్ నాయకుల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ నాయకుల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్ నగర్: కాంగ్రెస్ పార్టీ గురువారం జడ్చర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ నాయకుల ప్రసంగాలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. స్థానిక పద్మావతి కాలనీలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు మీ పార్టీనే అధికారంలోనే ఉన్నదన్న సంగతి మరచి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్రం అప్పట్లో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగి ఉంటే ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకత అవసరం ఎందుకొచ్చేదని ఆయన ప్రశ్నించారు.పాలమూరు వలసలకు చిరునామాగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని, 14 రోజులకు ఒకసారి తాగు నీరు వచ్చే పరిస్థితి కూడా కాంగ్రెస్ వల్ల దాపరించిందని ఆయన ఎద్ధేవా చేశారు.

నీళ్ళు, నిధులు, నియమకాలల్లో తెలంగాణ పట్ల వివక్ష చూపినందుకే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి సాధించుకున్నామని అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకనే పాలమూరులో నిత్యం తాగునీరు అందుతుందని తెలిపారు. రేవంత్ రెడ్డికి వెనకబడిన, బడుగు, బలహీన వర్గాలంటే చిన్న చూపని, వారిని పిచ్చగుంట్ల వారని హేళనగా మాట్లాడడం తగదని ఆయన తీవ్రంగా విమర్శించారు. సీఎం కేసీఆర్ ను, తమ పార్టీ నాయకులపై అవాక్కులు చెవాక్కులు వాగితే తగిన బుద్ధి చెపుతామని మంత్రి హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ గణేష్, పట్టణ అధ్యక్షుడు శివరాజ్, కౌన్సిలర్ రోజా వెంకటేష్ తదితర నాయకులు ఉన్నారు.


Next Story

Most Viewed