బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ కీలక సందేశం

by Disha Web Desk 2 |
బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ కీలక సందేశం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ సందేశం పంపించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. ‘14 ఏళ్లు సుదీర్ఘంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నాం.. అనుకున్న విధంగానే ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. నిబద్ధత కలిగిన లక్షలాది కార్యకర్తల అసమాన కృషితో అపురూప విజయాలు సాధించి రెండుసార్లు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టింది. ఉద్యమ వీరులుగా ఆనాడు.. నవ తెలంగాణ నిర్మాణయోధులుగా ఈనాడు పట్టుదల.. అంకితభావంతో పనిచేస్తూ అపూర్వ విజయాలు సాధించిపెట్టింది మీరే..! మీరిచ్చిన బలంతోనే 60 లక్షల సభ్యత్వంతో అజేయమైన శక్తిగా బీఆర్ఎస్ ఎదిగింది. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఎవ్వరికీ సాధ్యం కానీ.. ఏకపక్ష విజయాలు సాధిస్తూ రికార్డులను తిరగరాసింది. 21 ఏండ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని.. ఆటుపోట్లను తట్టుకొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నాము.

నాడు కరువుతో అల్లాడిన తెలంగాణ.. నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యమై దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఇక.. మన ఒక్క రాష్ట్రం బాగుంటే సరిపోదు.. దేశం కూడా బాగుండాలి. దేశాన్ని ఇన్నాళ్లు పాలించిన కాంగ్రెస్.. బీజేపీ పార్టీలకు తెలివి లేదు.. విజన్ లేదు.. సంకల్పం లేదు. అందుకే దేశానికి కొత్త ఎజెండాను నిర్దేశించి.. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు భారత రాష్ట్ర సమితిగా మరో ప్రస్థానాన్ని మొదలుపెట్టినం. ఏదైనా పని మొదలు పెడితే.. కడదాకా కాడిదించే అలవాటేలేని ఉక్కు సంకల్పం మనది. అబ్కీ బార్ కిసాన్ సర్కారు నినాదం ఎత్తుకొని దేశం కోసం బయలెల్లిన మన పార్టీ పైన కేంద్రంలోని బీజేపీ పార్టీ బరితెగింపు దాడులు చేస్తూ.. తెలంగాణ ప్రగతిని అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది. వేల దాడులు.. లక్షల కుట్రలను ఛేదించి నిలిచి గెలిచిన పార్టీ మనది.

నాడు మనం భయపడితే తెలంగాణ వచ్చేదా? సాహసమే ఊపిరిగా సాగుతున్న ప్రయాణంలో.. మీరే నా బలం.. మీరే నా బలగం. తెలంగాణ చైతన్యం తొణికిసలాడే గడ్డ. ప్రజలే కేంద్రం బిందువుగా.. వారి సమస్యలే ఇతివృత్తంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకోదు. చిల్లర మల్లర రాజకీయ శక్తులను ఎప్పుడూ ఆదరించదు. తెలంగాణతో బీఆర్ఎస్ పార్టీది పేగుబంధం. పురిటిగడ్డపైన మరోసారి గులాబీ పార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యం. ఇది ఎన్నికల సంవత్సరం.. నిరంతరం ప్రజల్లో వుంటూ పనికిమాలిన పార్టీలు పనికట్టుకొని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తతతో తిప్పికొట్టాలి. భారత రాష్ట్ర సమితిని మరింత బలోపేతం చేసే బాధ్యత మీ భుజ స్కంధాలపైనే వుంది. ధర్మమే జయిస్తుంది.’’ అంటూ బీఆర్ఎస్‌లో శ్రేణులకు గులాబీ బాస్ సందేశం పంపించారు.


Next Story

Most Viewed