ప్రధాని మోడీపై BBC డాక్యుమెంటరీ వెనుక చైనా!

by Disha Web Desk 2 |
ప్రధాని మోడీపై BBC డాక్యుమెంటరీ వెనుక చైనా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర సంచలనంగా మారింది. రాజకీయ దుమారం రేపుతున్న ఈ వ్యవహారం మంగళవారం ఊహించని మలుపు తీసుకుంది. బీబీసీ భారత్‌పై నెగిటివ్ ప్రచారం చేయడం వెనుక చైనా హస్తం ఉందని బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మాలానీ మంగళవారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు బీబీసీ చైనా చెందిన హువావే అనే సంస్థ నుండి నిధులు పొందిందని 'క్యాష్ ఫర్ ప్రాపగాండా డీల్'లో భాగంగానే ఇదంతా చేస్తోందని ఆరోపించారు. ఇది యాంటీ ఇండియా కాదా అని జెఠ్మాలానీ ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించారు. యూకే వెలుపల ఉన్న వ్యూవర్స్ కోసం బీబీసీ వెబ్ సైట్ హువావేతో డీల్ కుదుర్చుకుందని దీనికి సంబంధించి ది స్పెక్టేటర్ కథనాన్ని జెఠ్మలాని షేర్ చేశారు.

బీబీసీది నగదు ప్రచార ఒప్పందం అని ఆరోపించారు. కాగా బ్రిటీష్ మ్యాగజైన్ ది స్పెక్టేటర్ 2 ఆగస్టు 2022 నాటి ఒక కథనంలో బీబీసీ తన విదేశీ జర్నలిజానికి నిధులు సమకూర్చుకోవడానికి హువావే డబ్బును ఉపయోగించుకుంటుందని, పెద్ద ఎత్తున బీబీసీకి ఈ సంస్థ ప్రకటనలు ఇచ్చిందని ఈ కథనంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో మహేష్ జెఠ్మలాని చేసిన ఆరోపణలు దేశ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. 2002 నాటి గుజరాత్ అల్లర్లలో నాటి సీఎం నరేంద్ర మోడీ పాత్ర ఉందని బీబీసీ డాక్యుమెంటరీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఈ డాక్యుమెంటరీని బ్యాన్ చేసింది. అయితే ఈ డాక్యుమెంటరీలో నిజాలు తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని ఇటీవల ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు వచ్చే నెల 6న విచారణ చేపట్టనుంది.



Next Story