కేంద్రం మితిమీరిన అప్పులు.. నిర్మలా సీతారామన్‌ కామెంట్లపై కవిత

by Dishafeatures2 |
కేంద్రం మితిమీరిన అప్పులు.. నిర్మలా సీతారామన్‌ కామెంట్లపై కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడే నాటికి భారతదేశ అప్పు రూ. 55 లక్షల కోట్లు ఉంటే తాజా బడ్జెట్ గణాంకాల ప్రకారం అది రూ. 155 లక్షల కోట్లకు పెరిగిందని, కేవలం తొమ్మిదేళ్ళలో కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్లను అదనంగా అప్పు తీసుకున్నదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా తెలంగాణ అప్పుల గురించి చేసిన వ్యాఖ్యలకు స్పందనగా కవిత పై కామెంట్లు చేశారు. కేంద్రం చేసిన అప్పులతో తెలంగాణ అప్పుల్ని పోల్చడం సమంజసం కాదన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఉండే ఆర్థిక అవసరాలను గుర్తించి సహకరించాల్సిన కేంద్రం చివరకు అప్పుల విషయంలో ఆంక్షలు పెట్టి అభివృద్ధిని, ప్రగతి అడ్డుకుంటున్నదని కవిత ఆరోపించారు.

మోడీ చేసిన కొత్త అప్పుల కారణంగా దేశ ప్రజల సగటు తలసరి రుణ భారం మూడు రెట్లు పెరిగిందన్నారు. సంపన్నుల సంపద పెరుగుతూ ఉన్నదని, జీడీపీలో కేవలం వారి వాటా 3% మాత్రమేనని, మిగిలినదంతా పేదలు, సామాన్యులు వివిధ రూపాల్లో కేంద్రానికి కడుతున్న పన్నులేనని కవిత వివరించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తాజా బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గించిందని, కేవలం 8.5 కోట్ల మందికి మాత్రమే జాబ్ కార్డులు ఉన్నాయన్నారు. ఉపాధి కల్పించడానికి సిద్ధపడని కేంద్ర ప్రభుత్వం కేటాయింపుల కంటే ఎక్కువే ఖర్చు చేసినట్లు నిర్మలా సీతారామన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

తెలంగాణకు మెడికల్ కాలేజీల విషయాన్ని కవిత ప్రస్తావిస్తూ, రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపిందని ఆరోపించారు. ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా కేంద్రం కనికరించలేదని, చివరకు నవోదయ పాఠశాలలను కూడా కొత్తగా మంజూరు చేయలేదన్నారు. కర్నాటక మెట్రోతో పాటు ఉత్తరప్రదేశ్‌లో చిన్న చిన్న పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులను మంజూరు చేసిన కేంద్రం తెలంగాణను విస్మరించిందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

Next Story