కర్రలతో దాడులు చేసుకున్న బాబాయ్, అబ్బాయ్ వర్గీయులు

by  |
కర్రలతో దాడులు చేసుకున్న బాబాయ్, అబ్బాయ్ వర్గీయులు
X

దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లాలో రాజకీయ వైరం భగ్గుమంది. బాబాయ్, అబ్బాయ్ వర్గీయలైన బీజేపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య బాహాబాహీ కర్రలు, రాళ్లతో దాడులు చేసుకునేంతవరకు వెళ్లింది. దాని వివరాల్లోకి వెళ్తే… కర్నూలు జిల్లా రాజకీయాల్లో బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి, వైఎస్సార్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వరసకు బాబాయి, అబ్బాయి అవుతారు.

రాజకీయ సిద్ధాంతాలు వేరు కావడం మూలంగా వీరి మధ్య వర్గపోరు జరుగుతోన్నది. ఇటీవల మొదలైన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజశేఖరరెడ్డి, సిద్ధార్థరెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ క్రమంలో కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తితో ఇంటికి వచ్చిన ప్రత్యర్థులు అతడితో పాటు, అతడి సోదరుడిపై దాడికి దిగారు. దీంతో బాధితుడి వర్గీయులు ఎదురు తిరిగారు. దీంతో ఇరు వర్గాలకు చెందిన వారు కర్రలు, రాళ్లతో చితక్కొట్టుకున్నారు.

గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసినా పరిస్థితులు చల్లబడలేదు. ఈ దాడిలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి అనుచరులు ఇద్దరికి గాయాలు కాగా, సిద్ధార్థరెడ్డి అనుచరుడితోపాటు ఏఎస్సైకి గాయాలయ్యాయి. దీంతో పోలీసులను భారీగా మోహరించి, బాధితులను ఆసుపత్రికి తరలించారు.

Next Story